RGV: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు జైలు శిక్ష
ABN, Publish Date - Jan 23 , 2025 | 11:55 AM
డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ ముంబై అంధేరీ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.
Director RGV Sentenced to Jail: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వర్మపై కేసు నమోదు అయింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. గత ఏడేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నా ఏనాడూ కోర్టుకు హాజరుకానీ ఆర్జీవీ ఈ తీర్పుపై ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే, అటు ఏపీలోనూ వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఏడు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది.
Updated Date - Jan 23 , 2025 | 12:21 PM