NDA : ఇక బెంగాల్ వంతు!
ABN, Publish Date - Feb 21 , 2025 | 06:00 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని ఎన్డీఏ ప్రకటించింది.
బిహార్, అసోంలోనూ మళ్లీ గెలుస్తాం.. ఎన్డీఏ నేతల కదనోత్సాహం
ప్రధాని అధ్యక్షతన కూటమి పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ
ఢిల్లీలో అసాధారణ విజయంపై మోదీకి చంద్రబాబు అభినందనలు
రాత్రికి ఢిల్లీలోనే ఉండిపోవాలని కోరిన షా..మళ్లీ వస్తానని చెప్పిన బాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని ఎన్డీఏ ప్రకటించింది. బెంగాల్తో పాటు రానున్న బిహార్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి గెలుస్తామని ధీమా వ్యక్తంచేసింది. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మధ్యాహ్నం జనపథ్లోని ఇంపీరియల్ హోటల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ విందు ఇచ్చారు. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు కలిసికట్టుగా పోటీ చేయాలని నేతలంతా నిర్ణయించారు. సమైక్యంగా, బలంగా పోరాడాలని తీర్మానించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే విలేకరులకు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధానికి నేతలంతా అభినందనలు తెలిపారన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లను మోదీ ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అసాధారణ విజయం సాధించారంటూ ఆయన్ను చంద్రబాబు అభినందించారు. విందు సమావేశం పిచ్చాపాటీగా జరిగిందని, దేశంలో జరుగుతున్న అన్ని విషయాల గురించీ మాట్లాడుకున్నామని సీఎం ఆ తర్వాత విలేకరులకు చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ రాత్రికి ఉండిపోవాలని షా కోరారు. తనకు ఇతరత్రా కార్యక్రమాలున్నందున మళ్లీ వస్తానని చంద్రబాబు ఆయనకు తెలిపారు. మోదీ, షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 06:01 AM