PM Modi: రాహుల్ అర్బన్ నక్సల్!
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:34 AM
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. రాహుల్, కేజ్రీవాల్పై వారి పేర్లను వినియోగించకుండా.. పరోక్షంగా మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము బీజేపీ, ఆరెస్సె్సతోపాటు..
దేశంపై యుద్ధాన్ని ప్రకటించారు
గుడిసెల్లో పేదలతో ఫొటోలు దిగే వాళ్లకు ఆ పేదల బాధలు అర్థం కావు
50 ఏళ్లలో ‘గరీబీ హఠావో’ కాలేదు
మేం పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం: మోదీ
‘అద్దాల మేడ’ కోసం ఎన్నికల్లో అసాధ్య హామీలు ఇస్తున్నారంటూ కేజ్రీవాల్పై విమర్శ
చైనా దురాక్రమణపై రాహుల్వి తప్పుడు ఆరోపణలు.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రాహుల్పై సభాహక్కుల నోటీసు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. రాహుల్, కేజ్రీవాల్పై వారి పేర్లను వినియోగించకుండా.. పరోక్షంగా మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము బీజేపీ, ఆరెస్సె్సతోపాటు.. భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నామని రాహుల్గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..! దీన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘కొందరు వ్యక్తులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అర్బన్ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పెట్టుకుని తిరుగుతారు. అయితే.. వారికి రాజ్యాంగం అర్థంకాదు. దేశ సమైక్యత గురించి తెలియదు’’ అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ‘బోర్’ అని రాహుల్ అనడంపైనా ప్రధాని స్పందించారు. గుడిసెల్లో ఫొటో సెషన్లకు ఫోజులిచ్చేవారికి పేదల బాధలు అర్థంకావన్నారు.
అందుకే పార్లమెంట్లో పేదల గురించి మాట్లాడితే.. సోనియా, రాహుల్కు ‘బోర్’కొడుతుందని ఎద్దేవా చేశారు. అటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను కూడా మోదీ మాటలతో దునుమాడారు. ‘‘ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించే కొన్ని పార్టీలతో యువతకు ‘ఆప్’ద పొంచి ఉంది. వారు అద్దాల మేడ నిర్మాణానికి అవినీతికి పాల్పడతారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పాలనపైనా దుమ్మెత్తిపోశారు. ‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని 50 ఏళ్లు కొనసాగించినా సాధించలేనిది తమ ప్రభుత్వం చేసి, చూపించిందని.. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని వివరించారు. 4 కోట్ల మంది పేదలకు సొంత ఇళ్లను ఇచ్చామని, 12 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లను కట్టించామని, వారి బాధలను అర్థం చేసుకున్నాం కాబట్టే ఇదంతా చేశామని వ్యాఖ్యానించారు. రాజీవ్గాంధీ 21వ శతాబ్ది పేరుతో గాలిమేడలు(హవాహవాయీ) నిర్మించారే తప్ప.. పరిస్థితులు మాత్రం 20వ శతాబ్దంలోనే ఉండేవన్నారు.
పేదల అభ్యున్నతిపైనా దృష్టి సారించలేదన్నారు. ‘‘అప్పట్లో కేంద్రం నుంచి గ్రామ సచివాలయం వరకు ఒకే పార్టీ పాలన ఉండేది. అయినా.. కేంద్రం ఇచ్చే రూ.1 పేదలకు అందేసరికి 15 పైసలుగా మారేది. మేం నగదు బదిలీని తీసుకొచ్చాం. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయిని లబ్ధిదారులకు చేరేలా చేశాం’’ అని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్తో పేదలందరికీ ఆరోగ్యభాగ్యాన్ని కలిగించామని, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ పథకాన్ని వినియోగించుకోవడంలేదని విమర్శించారు. పదికోట్ల నకిలీ ఖాతాలను స్తంభింపజేశామని, ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాచేశామన్నారు. ‘‘గతంలో తరచూ రూ.లక్షల కోట్ల అవినీతిపై వార్తలు వచ్చేవి. గడిచిన పదేళ్లలో మా సర్కారు హయాంలో ఎలాంటి అవినీతి ఆరోపణల్లేవు. కేంద్రంలో పదేళ్లుగా అవినీతి లేకపోవడంతో ప్రజలు లబ్ధిపొందారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
రాహుల్పై రాజ్నాథ్ ఫైర్
భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని, ఆర్మీ చీఫ్ స్వయంగా ఈ విషయం చెప్పాడంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ చేసిన ప్రసంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ గానీ, సైన్యాధికారులు గానీ ఆ మాట అనలేదని ఎక్స్లో పేర్కొన్నారు. రాహుల్గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ఆయన బాధ్యతారహితంగా మాట్లాడడం, రాజకీయాలకు పాల్పడడం విచారకరమన్నారు. రాహుల్గాంధీ చరిత్రపై అవగాహన పెంచుకోవాలని హితవుపలికారు.
రాహుల్పై సభా హక్కుల నోటీసు
రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సభాహక్కుల నోటీసు ఇచ్చారు. మంగళవారం ఆయన ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖను అందజేసి.. రాహుల్ గాంధీపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. చైనా తమ భూభాగంలోకి చొరబడిందంటూ రాహుల్ తన వ్యాఖ్యలతో భారత్ గౌరవానికి భంగం కలిగించారన్నారు. నిస్సిగ్గుగా చారిత్రక అంశాలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 05 , 2025 | 04:34 AM