Maha Kumbh mela: మహాకుంభమేళా ఎలా ఉందో చూడండి.. ఫొటోస్ రిలీజ్ చేసిన ISRO..
ABN, Publish Date - Jan 22 , 2025 | 02:52 PM
మహాకుంభమేళాకు సంబంధించి ISRO తాజాగా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Maha Kumbh mela: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
అంతరిక్షం నుంచి..
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేసింది. దీంతో మహాకుంభ్ ఓ పెద్ద నగరాన్ని తలపిస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పెద్ద నగరంగా మహాకుంభ్
మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను ఇస్త్రో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 22 నాటికి పూర్తిగా నిర్మాణాలు వెలిశాయి. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
భక్తుల కోసం..
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. భక్తుల కోసం సుమారు లక్షా 60 వేల టెంట్లను, లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. అంతేకాకుండా, వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అలాగే, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో దాదాపు 125 అంబులెన్సులు అందుబాటో ఉన్నాయి. రాయ్బరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అక్కడ అందుబాటులో ఉంటారు.
Updated Date - Jan 22 , 2025 | 03:10 PM