Wang Yi: భారత్-చైనా భాయీ భాయీ!
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:19 AM
భారత్-చైనా చేతులు కలిపితే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని, ప్రపంచ దక్షిణాది దేశాలు శక్తిమంతమవుతాయని చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ పేర్కొన్నారు.
ఇరు దేశాలు చేతులు కలిపితే ప్రపంచ ప్రజాస్వామ్యం బలోపేతం
ఏనుగు, డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేయాలి
చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ
బీజింగ్, మార్చి 7: భారత్-చైనా చేతులు కలిపితే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని, ప్రపంచ దక్షిణాది దేశాలు శక్తిమంతమవుతాయని చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ పేర్కొన్నారు. నియంతృత్వం, దౌర్జన్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలూ అగ్రగామి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చైనా పార్లమెంటు వార్షిక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాంగ్ శుక్రవారం దేశ, విదేశ మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై మాట్లాడారు. భారత్ చిహ్నమైన ఏనుగును, చైనా చిహ్నమైన డ్రాగన్ను ప్రస్తావిస్తూ.. ‘ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయటమే భారత్-చైనా సంబంధాలకు సరైన మార్గం. ఒకరికొకరికి నష్టం చేసుకోవటం కంటే పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి మీద ఒకరం నిఘా పెట్టుకోవటం కంటే.. చేతులు కలిపి సమిష్టిగా పని చేయాలి.
దీనివల్లే మన రెండు దేశాలకూ లబ్ధి చేకూరుతుంది’ అని వాంగ్ తెలిపారు. ప్రాచీన నాగరికతలకు నిలయమైన ఇరుదేశాలూ సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వాంగ్ చెప్పారు. ఈ ఏడాది భారత్-చైనా దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటాయని గుర్తు చేస్తూ.. గత సుదీర్ఘ అనుభవాల నేపథ్యంలో కొత్త ప్రణాళికలు రచించి ఇరుదేశాల సుస్థిర అభివృద్ధి కోసం భారత్తో కలిసి పని చేయటానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాతోపాటు పలు దేశాలపై విధిస్తున్న సుంకాలపై తీవ్రంగా స్పందిస్తూ.. అంతర్జాతీయ సహకారాన్ని పక్కనపెట్టి, ఏ దేశానికి ఆ దేశం సొంత ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తే ప్రపంచం ఆటవికరాజ్యంగా మారుతుందని వాంగ్ వ్యాఖ్యానించారు. చిన్న, బలహీన దేశాలు తొలుత తీవ్రంగా నష్టపోతాయి.. అంతర్జాతీయ నిబంధనలు, వ్యవస్థలు ధ్వంసమవుతాయని హెచ్చరించారు.
Updated Date - Mar 08 , 2025 | 09:28 AM