Stock Market: భారీగా పతనమైన జొమాటో, స్విగ్గీ.. సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్..
ABN, Publish Date - Jan 21 , 2025 | 03:52 PM
మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు దేశీయ సూచీలను కుంగదీస్తున్నాయి. జొమాటో లాభాల్లో క్షీణత వల్ల సదరు సంస్థ షేర్లతో పాటు స్విగ్గీ కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంది.
వరుస నష్టాల నుంచి గత వారం కాస్త రికవరీ అయినట్టు కనిపించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు దేశీయ సూచీలను కుంగదీస్తున్నాయి. జొమాటో లాభాల్లో క్షీణత వల్ల సదరు సంస్థ షేర్లతో పాటు స్విగ్గీ కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి. (Business News).
సోమవారం ముగింపు (77, 073)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఒక దశలో 1500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 75, 838 వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరకు 1235 పాయింట్ల నష్టంతో 75, 838 వద్ద రోజును ముగించింది. అన్ని రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. మరో వైపు నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. 320 పాయింట్ల నష్టంతో 23, 024 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్లో డిక్సన్ టెక్నాలజీస్, జొమాటో, ఎమ్సీఎక్స్ ఇండియా, కల్యాణ్ జువెల్లర్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. హిందుస్తాన్ పెట్రో, అపోలో హాస్పిటల్స్, జేకే సిమెంట్స్, పూనావాలా ఫిన్కార్ప్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. జొమాటో 10 శాతానికి పైగా, స్విగ్గీ 8 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1271 పాయింట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. బ్యాంక్ నిఫ్టీ 779 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.58గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 21 , 2025 | 03:52 PM