Bapatla: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి
ABN, Publish Date - Jan 03 , 2025 | 05:34 AM
మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది.
నడిరోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య
మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తకు ‘మరణ శిక్ష’
బాపట్ల జిల్లాలో ఘటన
వీడియో వైరల్తో తీవ్ర సంచలనం
బాపట్ల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాపట్ల జిల్లా అడవుల దీవి పోలీసు స్టేషను పరిధిలోని కొత్తపాలేనికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమరేంద్ర మద్యానికి బానిసై నిత్యం భార్య అరుణను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీలు జరిగినా అమరేంద్రబాబు తీరులో మార్పు రాకపోగా, వేధింపులు మరింత పెరిగాయి.
అమరేంద్రబాబు, అరుణల మధ్య కొత్తపాలెంలో గతనెల 31న తీవ్ర ఘర్షణ జరిగింది. ఏళ్లుగా ఓపిక పడుతూ వస్తున్న అరుణ భర్తపై కర్రతో తీవ్రంగా దాడి చేసి చంపేసింది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరుణ తన భర్తను కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు భావించారు. అయితే తన భర్తను కర్రతో కొట్టిన తర్వాత కూడా అరుణ కోపం చల్లారలేదు. అమరేంద్రను నడిరోడ్డుపైకి లాక్కొచ్చి ఉరివేసి, మెడపై కాలువేసి అదిమిపట్టి చంపినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో దృశ్యాల ఆధారంగా కేసులో సెక్షన్ల నమోదుపై పోలీసులు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 03 , 2025 | 05:34 AM