School Education,: పుస్తకాలకు ‘టెండర్’!
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:50 AM
గత వైసీపీ సర్కారు విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ముద్రించే సేల్ బుక్స్(విక్రయించే పుస్తకాలు) కాంట్రాక్టు పెద్ద కంపెనీలకు దక్కేలా నిబంధనలు రూపొందించారు.
సేల్ బుక్స్ ప్రింటింగ్లో అడ్డగోలు నిబంధనలు
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాఠశాల విద్యాశాఖ అధికారుల తీరు మారలేదు. గత వైసీపీ సర్కారు విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ముద్రించే సేల్ బుక్స్(విక్రయించే పుస్తకాలు) కాంట్రాక్టు పెద్ద కంపెనీలకు దక్కేలా నిబంధనలు రూపొందించారు. బుధవారం అందుబాటులోకి వచ్చిన సేల్ బుక్స్ టెండర్ డాక్యుమెంట్... గైడ్లు ముద్రించే కంపెనీలకు మేలు చేసేలా, చిన్న ముద్రణదారులను దెబ్బతీసేలా ఉందని విమర్శలొస్తున్నాయి. రాబోయే రెండు విద్యాసంవత్సరాల సేల్ బుక్స్కు ముద్రణదారులను ఎంప్యానెల్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. పేపరుతో కలిపి ఒక్కో పేజీ ధరను రూ.38.5గా నిర్ణయించింది. ఆ ధరకు పుస్తకాలు ముద్రించేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని కోరింది. ప్రైవేటు బడుల్లోని 30,82 ,922 మంది విద్యార్థులకు సేల్బుక్స్ ముద్రించే కాంట్రాక్టును ఎంప్యానెల్ అయిన ప్రింటర్లు, ప్రచురణకర్తల(పబ్లిషర్ల)కు ఇస్తుంది. ఇందుకోసం ఈ నెల 18న టెండర్లు పిలవగా, మార్చి 3 దరఖాస్తులకు చివరి తేదీ. అర్హత సాధించిన కంపెనీల వివరాలను మార్చి 10న ప్రకటిస్తారు.
ప్రభుత్వం మారినా అదే తీరు
రాష్ట్రంలో దాదాపు 60మంది ముద్రణదారులు ఉండగా వారిలో 50మంది వరకూ చిన్న ప్రింటర్ల కేటగిరీలో ఉన్నారు. పాఠ్యపుస్తకాల టెండర్ నిబంధనలు వారికీ ఉపాధి కల్పించేలా ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం పెద్ద కంపెనీల ముద్రణదారులకు మాత్రమే లబ్ధి చేకూరేలా నిబంధనలు విధించారు. గతేడాది నిబంధనల్లో గత మూడేళ్లలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.5కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు గత మూడేళ్లలో ప్రతి సంవత్సరం రూ.10కోట్ల టర్నోవర్ ఉండాలనే పేర్కొన్నారు. 2024-25 ఆర్థికసంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఈ ఏడాది కూడా రూ.10కోట్లు ఉండాలని స్పష్టం చేశారు. గత మూడేళ్లలో కచ్చితంగా రెండేళ్లు పాఠ్యపుస్తకాలు ముద్రించి ఉండాలనే నిబంధన కూడా పెట్టారు. పాఠశాల విద్యాశాఖ విధించిన నిబంధనలతో నాలుగు కంపెనీలకు ఎక్కువ మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. వారి కోసమే టర్నోవర్ పెంచారని, వైసీపీ విధానాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఉచిత పుస్తకాల విషయంలో పేపరును ప్రభుత్వమే ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కానీ ఇప్పుడు సేల్ బుక్స్ విషయంలో టర్నోవర్ రెట్టింపు చేయడంతో చిన్న ప్రింటర్లకు అవకాశం లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 05:50 AM