అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం!
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:27 AM
కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా.. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారిలో ఎవరిని ప్రశ్నించాల్సి వచ్చినా పిలుస్తామని జస్టిస్
కాళేశ్వరంపై కాగ్, విజిలెన్స్, ఎన్డీఎ్సఏ నివేదికలను పరిశీలిస్తాం
జస్టిస్ పినాకి చంద్రఘోష్ వెల్లడి
జస్టిస్ ఘోష్ను కలిసిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా.. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారిలో ఎవరిని ప్రశ్నించాల్సి వచ్చినా పిలుస్తామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ స్పష్టం చేశారు. మెదడును రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అవసరమైతే ఆయనను కూడా విచారణకు పిలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా జస్టిస్ చంద్రఘోష్ ఈ విధంగా స్పందించారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యాలపై విచారణ కోసం జస్టిస్ చంద్రఘో్షను కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆయన రెండురోజుల విచారణ అనంతరం గురువారం విలేకర్లతో మాట్లాడారు. త్వరలోనే బ్యారేజీలను సందర్శిస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన కాగ్, ఎన్డీఎస్ఏ నుంచి పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుంటామని, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిందని.. వీటన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. విచారణ లో భాగంగా ఐఐటీ నిపుణుల సహకారం కూడా తీసుకుంటామని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పిస్తామన్నారు. బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలపై ఎన్డీఎ్సఏకు లేఖ రాస్తామని తెలిపారు.
త్వరలో బహిరంగ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ, నాణ్యత, నిర్వహణపరమైన లోపాలకు సంబంధించి సమాచారం అందించాల్సింగా ప్రజలను జస్టిస్ చంద్రఘోష్ కోరారు. లోపాలను వెలికితీయడం, బాధ్యులను గుర్తించటం, నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఎవరి వద్ద తగిన సమాచారం ఉన్నా తమకు అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ కమిషన్ తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఒక ప్రకటన వెలువరించారు. ఫిర్యాదులు/నివేదికలు/సాక్ష్యాధారాలను నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని తెలిపారు. సీల్డ్ కవర్లో వివరాలు భద్రపరిచి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ (కాళేశ్వరం), 8వ అంతస్తు, బూర్గుల రామకృష్ణారావు భవన్, డీ బ్లాక్, హైదరాబాద్ చిరునామాలో ఉన్న బాక్సుల్లో మే31వ తేదీలోపు వేయాలని కోరారు. తగిన సాఽక్ష్యాధారాలు లేని, నోటరీల సంతకం లేని పత్రాలు తిరస్కరిస్తామని జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. అనంతరం బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న వారికి నోటీసులు/సమన్లు జారీ చేయనున్నారు.
కమిషన్కు పూర్తిగా సహకరిస్తాం: ఉత్తమ్
జస్టిస్ ఘోష్ను బూర్గుల భవన్లో మంత్రి ఉత్తమ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమిషన్కు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగు రోజుల్లో ఎన్డీఎ్సఏ నివేదిక ప్రభుత్వానికి అందనుందని, దాని ఆధారంగా బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే మరమ్మతులు జరిపి వచ్చే సీజన్కు బ్యారేజీలను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
Updated Date - Apr 26 , 2024 | 05:27 AM