టమాట ఢమాల్!
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:13 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా టమాట రైతులకు అప్పులే మిగిలాయి. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో చేతికందిన టమాట తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
-వందల ఎకరాల్లో పాడైన టమాట తోటలు
-అక్కడక్కడ ఉన్నా కాయలకు మచ్చలు
-అప్పుల్లో కూరుకుపోయిన రైతులు
యాచారం, సెప్టెంబరు 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా టమాట రైతులకు అప్పులే మిగిలాయి. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో చేతికందిన టమాట తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకొని సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం జరగడంతో లబోదిబోమంటున్నారు. ప్రకృతి విలయంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని పెట్టుబడి కూడా రాకుండా పోయిందని తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దిక్కదోచని స్థితిలో టమాట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఎకరాల్లో టమాట తోటలున్నా కాయలకు మచ్చలు రావడంతో మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఎకరాకు సాగుకయ్యే ఖర్చు
ఎకరం టమాట తోట సాగుకు దుక్కి దున్నడానికి గంటకు రూ.1,200, నాలుగు బస్తాల అడుగుపిండికి రూ.6,800, టమాట నారుకు రూ.12,800, నారు నాటడం కోసం ఐదువ ుంది కూలీలకు రూ.2,500, కలుపు తీయడానికి రూ.5,000, పురుగు మందులకు రూ.5,650, కాయలు తెంచడానికి రూ.2000ల వ్యయం అవుతుందని రైతు కలకొండ బీరప్ప వివరించారు. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసినా మార్కెట్లో ధర లేకపోగా నేడు వర్షాల కారణంగా అప్పులు మిగిలాయని ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. యాచారం మండలంలో సుమారు 350 ఎకరాల్లో టమాటను సాగు చేశారు. తరచూ కురుస్తున్న వర్షాలతో సుమారు 150 ఎకరాలకు మించి తోటలు పాడైనట్లు తెలుస్తోంది. పంటలు దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక టమాట రైతులు ఆగమాగం అవుతన్నారు.
పంటంతా పాడైపోయింది
అప్పులు మిగిలాయి
ఇటీవల కురిసిన వర్షాలకు చేతికందిన టమాట తోట పూర్తిగా పాడైపోయింది. పంట చేతికందితే మంచి ఆదాయం వచ్చేది. రెండెకరాలలో సాగు చేసిన టమాట తోటంతా దెబ్బతినడంతో అప్పులే మిగిలాయి. వర్షాలు కురవకుంటే దిగుబడి బాగా వచ్చేది. పంట పూర్తిగా దెబ్బతినడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
-వెంకటయ్య, టమాట రైతు, చౌదర్పల్లి
Updated Date - Sep 10 , 2024 | 11:13 PM