పదవి ముగిసింది.. అప్పులు మిగిలాయి
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:52 PM
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన సర్పంచ్లకు పదవీకాలం ముగిసినా.. అప్పులు మాత్రం వెంటాడుతున్నాయి. ఆనాటి ప్రభుత్వ సూచన మేరకు పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు తదితర పనులన్నీ సొంత నిధులతో సకాలంలో పూర్తి చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడి పూర్తి చేశారు. ఆయా పనులకు అధికారులు ఎంబీ రికార్డు సైతం చేశారు. అయినా నెలలు, ఏడాది గడిచినా బిల్లులు మాత్రం రాలేదు. ఇంతలో తమ పదవీ కాలం కూడా ముగిసింది. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. అయినా తాము పెట్టిన పెట్టుబడి సొమ్ము రాక.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మాజీ సర్పంచ్లు తలలు పట్టుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 1,159 పంచాయతీల్లో సుమారు రూ.224.05 కోట్లు బకాయిలు ఉన్నాయి.
నియోజకవర్గం పంచాయతీలు పెండింగ్ బిల్లులు(రూ.కోట్లలో)
చేవెళ్ల 132 9.6
ఇబ్రహీంపట్నం 80 4.85
మహేశ్వరం 64 9.50
షాద్నగర్ 152 17
కల్వకుర్తి 102 5.10
వికారాబాద్ 137 50
పరిగి 144 12
తాండూరు 173 06
కొడంగల్ 114 65
మేడ్చల్ 61 45
మొత్తం 1,159 224.05
-------------------------------------
భార్య నగలు తాకట్టు పెట్టి..
ఈయన పేరు దశరథ. తాండూరు మండలం గుండ్లమడుగు తండా మాజీ సర్పంచ్. గ్రామాభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్లు, స్ట్రీట్ లైట్స్, సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ పనులు చేసేందుకు డబ్బులు లేక తన భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడు. పూర్తి చేసిన పనులకు అధికారులు ఎంబీ రికార్డు కూడా చేశారు. బిల్లులు రాగానే నగలు విడిపించుకోవచ్చని అనుకున్నాడు. నెలలు, సంవత్సరం దాటినా బిల్లుల జాడేలేదు. ఇంతలోనే తన పదవీకాలం కూడా పూర్తయింది. తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోలేక.. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. రేపుమాపు అంటూ అధికారులు చెబుతుండటంతో కాలయాపన తప్ప బిల్లులు రావడం లేదు. ఆనాటి ప్రభుత్వం పనులు త్వరగా పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడి చేసింది. తీరా అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే బిల్లులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన కోరుతున్నాడు.
===========================
పదవి ముగిసింది.. అప్పులు మిగిలాయి
-పెండింగ్లో బిల్లులు.. అప్పుల్లో మాజీ సర్పంచ్లు
-ఒక్కో పంచాయతీకి రూ.లక్షల్లో బకాయిలు
-అధిక వడ్డీలకు తెచ్చి అభివృద్ధి పనులు పూర్తి
-బంగారం, ఇళ్లు తాకట్టు పెట్టిన పలువురు ప్రజా ప్రతినిధులు
-వడ్డీలు కట్టలేక అవస్థలు.. తప్పని నిరీక్షణ
పదవీ కాలం ముగియడంతో పెరిగిన ఆందోళన
-ఉమ్మడి జిల్లాలో రూ.224.05 కోట్లు పెండింగ్
-ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ల వేడుకోలు
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన సర్పంచ్లకు పదవీకాలం ముగిసినా.. అప్పులు మాత్రం వెంటాడుతున్నాయి. ఆనాటి ప్రభుత్వ సూచన మేరకు పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు తదితర పనులన్నీ సొంత నిధులతో సకాలంలో పూర్తి చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడి పూర్తి చేశారు. ఆయా పనులకు అధికారులు ఎంబీ రికార్డు సైతం చేశారు. అయినా నెలలు, ఏడాది గడిచినా బిల్లులు మాత్రం రాలేదు. ఇంతలో తమ పదవీ కాలం కూడా ముగిసింది. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. అయినా తాము పెట్టిన పెట్టుబడి సొమ్ము రాక.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మాజీ సర్పంచ్లు తలలు పట్టుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 1,159 పంచాయతీల్లో సుమారు రూ.224.05 కోట్లు బకాయిలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్, ఆగస్టు 21 ): గ్రామాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఏళ్లుగా రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక తాజా మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పనులు పూర్తి చేస్తే బిల్లుల రాక ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఒకొక్క మేజర్ పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా, చిన్న పంచాయతీల్లో రూ.5-10 లక్షల వరకు పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ నెలా పల్లె ప్రగతి నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నా.. అవి కేవలం సిబ్బంది జీతాలు, ఇతర అవసరాలకే సరిపోతున్నాయి. రూ.లక్షల కొద్దీ అప్పులు తెచ్చి చేసిన పనుల బిల్లులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వంలోనూ అదే దుస్థితి
పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలతో పాటు విద్యుత్, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు, ఇతర అత్యవసరాలకు పెట్టిన పెట్టుబడి బిల్లుల్లో సర్పంచ్లకు ఏది అందని పరిస్థితి. బిల్లులు వస్తాయని ఆశతో చూసిన సర్పంచ్ల పదవీ కాలం సైతం ఇటీవల ముగిసింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల చేతులోకి పాలన వెళ్లడంతో వారు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవీ ముగిసి ఎనమిది నెలలు అవుతున్నా బిల్లులు మాత్రం రావడంలేదు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు పూర్తి చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా తమ పరిస్థితి ఏమీ మారలేదని ఆయా సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వమైనా ఆదుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.
10 నియోజకవర్గాల్లో..
సర్వతోముఖాభివృద్ధే లక్ష్యమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాలు సైతం ఇస్తున్నాయి. ఇంతవరకు భాగానే ఉన్నా.. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లు పెట్టిన పెట్టుబడి మాత్రం ఇవ్వడం లేదుం. వారు వడ్డీలు చెల్లించలేక అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. ఉమ్మడి జిల్లాలోని 10 రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలో మొత్తం 1,159 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రూ.224.05 కోట్లు బకాయిలు ఉన్నాయి.
అందని గౌరవ వేతనం
సర్పంచ్ల పదవీకాలం ముగిసినా వారికి రావాల్సిన పెండింగ్ గౌరవ వేతనం మాత్రం రాలేదు. ఆరు నెలలుగా చెల్లించాల్సిన వేతనం అందని పరిస్థితి. నెలకు రూ.5 వేల చొప్పున అందాల్సిన గౌరవ వేతనాలు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. నెలకోసారి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎప్పుడూ సక్రమంగా ఇచ్చిన దాఖలాలు లేవని వాపోతున్నారు. పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను త్వరగా ఇవ్వాలని మాజీ సర్పంచ్లు కోరుతున్నారు.
-----------------
ఏడాదిగా ఎదురు చూస్తున్న..
కడ్తాల గ్రామంలో రూ.20 లక్షలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాను. చేసిన పనులకు బిల్లులు రాలేదు. ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. గత, ప్రస్తుత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా బిల్లులు మాత్రం రావడం లేదు. త్వరగా బిల్లులు చెల్లించి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
-గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్, కడ్తాల
-------------------
రూ.30 లక్షలు రావాల్సి ఉంది
పదవీ కాలం ముగిసే వరకు గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేశాం. దీనికి సంబంధించి ఎంబీ రికార్డులు కూడా పూర్తయ్యాయి. రూ.30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. నెలలుగా బిల్లుల కోసం ఎదురు చేస్తున్నాను.
-లావణ్య శంకర్, మాజీ సర్పంచ్, రామన్నగూడ, చేవెళ్ల మండలం
-------------
త్వరగా మంజూరు చేసి ఆదుకోవాలి
వడ్డీకి డబ్బులు తెచ్చి గ్రామంలో పనులు పూర్తి చేశాం. వివిధ పనులకు గాను రూ.23 లక్షలు ఖర్చు పెట్టాం. అధికారులు రికార్డులు సిద్ధం చేశారు. అయినా ఇప్పటి వరకు డబ్బులు రాలేవు. త్వరగా మంజూరు చేసి ఆదుకోవాలి. మాజీ సర్పంచ్ల బాధలు అర్థం చేసుకోవాలి.
-సాదా మల్లారెడ్డి, సర్పంచ్, కొత్తగూడ, కందుకూరు మండలం
---------------------
బిల్లులు రాక అప్పులపాలయ్యాను
రూ.20 లక్షలతో పంచాయతీ భవనం, రూ.5 లక్షలతో క్రీడాప్రాంగణాలను నిర్మించాను. పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభించుకున్నాం. కాగా, బిల్లులు మాత్రం ఇప్పటికీ రాలేదు.ప సొంత డబ్బులతో పనులు చేపట్టాను. బిల్లులు రాక ఇబ్బందిగా ఉంది. రికార్డు అయింది. బిల్లులు రాక అప్పులపాలయ్యాను.
-రాంచంద్రయ్య, మాజీ సర్పంచి, బర్కత్పల్లి, పరిగి మండలం
------------
ఎవరికి చెప్పినా ఏం లాభం లేదు
ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.6.50 లక్షలతో సీసీ రోడ్లు, పంచాయతీ ఖర్చుల కింద రూ.2.50 లక్షలు ఖర్చు చేశా. అయితే పనులు చేపట్టి నెలలు గడస్తున్నా బిల్లులు రావడం లేదు. సగమే ఇచ్చారు. ఇంకా సగం రావాల్సి ఉంది. ఎవరికి చెప్పుకున్నా ఏం లాభం లేదు. అధికారులు స్పందించి త్వరగా బిల్లులు ఇప్పించాలి.
-జయమ్మదాస్, మాజీ సర్పంచ్ అంగడిచిట్టెంపల్లి, పూడూరు మండలం జిల్లా
Updated Date - Aug 22 , 2024 | 12:00 AM