వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రతీక్జైన్
ABN, Publish Date - Jun 15 , 2024 | 11:11 PM
వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిని నల్లగొండ జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ నారాయణరెడ్డి నల్లగొండకు బదిలీ
వికారాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిని నల్లగొండ జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణరెడ్డి స్థానంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న ప్రతీక్జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. నేడు ఆదివారం బాధ్యతలు స్వీకరించున్నారు. ప్రతీక్జైన్ గౌహతి ఐఐటీలో ఎలక్ర్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్య 2013లో పూర్తి చేసుకోగా, 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. శిక్షణపూర్తి చేసుకున్న అనంతరం ఆయన రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న ప్రతీక్ జైన్ను వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. 2023, ఫిబ్రవరి 2వ తేదీన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి జిల్లాలో 17 నెలల పాటు కొనసాగారు. జిల్లాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో జిల్లాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మొదలుకుని విద్య, వైద్య ఆరోగ్యం, గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరుగులు పెట్టించారు. ఉపాధి హామీ పనులు, వైకుంఠధామాలు, ప్రకృతి, బృహత్ వనాల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా అంశాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్నికలు ముగియడంతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించే ఈ సమయంలో కలెక్టర్ జిల్లా నుంచి బదిలీ అయ్యారు. అందరితో సమన్వయంగా మెలుగుతూ ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్గా తక్కువ కాలం పనిచేసినా జిల్లాలో చెరగని ముద్ర వేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్శర్మకు పదోన్నతి
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మకు జిల్లా కలెక్టర్గా పదోన్నతి కల్పించారు. 2022, నవంబరు 14న జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ శర్మ వికారాబాద్ జిల్లాలో 19 నెలల పాటు విధులు నిర్వహించారు. రాహుల్ శర్మ 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2018 మే నుంచి 2019 ఏప్రిల్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసిన ఆయన ఆ తరువాత న్యూఢిల్లీలో 2019 సెప్టెంబర్ వరకు అసిస్టెంట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2020, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఆయన బాధ్యతలు నిర్వహించగా, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు. స్థానిక సంస్థల్లో పన్నుల వసూళ్లు, వివిధ అభివృద్ధి పనులు వేగం పుంజుకునేలా రాహుల్శర్మ తనదైన శైలిలో కృషి చేశారు. ఈసారి ఐఏఎస్ అధికారుల బదిలీల్లో రాహుల్శర్మకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా నియమించారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గత నెలలో జరిగిన లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షించారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరించే ఆయన సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
Updated Date - Jun 15 , 2024 | 11:11 PM