రోడ్డు విస్తరణకు శ్రీకారం
ABN, Publish Date - Jun 25 , 2024 | 12:39 AM
చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి చిన్నకొండూరుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ చేసే పక్రియకు సోమవారం అధికారులు శ్రీకారం చుట్టారు.
మడిగెల యజమానులకు సమాచారం
ఎనహెచ-65నుంచి సీతారామ ఆలయం వరకు కొలతలు
చౌటుప్పల్ టౌన, జూన 24: చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి చిన్నకొండూరుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ చేసే పక్రియకు సోమవారం అధికారులు శ్రీకారం చుట్టారు. మునిసిపల్ కమిషనర్ ఎన.వెంకటేశ్వరనాయక్, ఆర్అండ్బీ డీఈఈ శైనాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నకొండూరుకు వెళ్లే రోడ్డు వెంట ఉన్న సుమారు 150 వ్యాపార మడిగెల యజమానులకు సమచారాన్ని అందించారు. మడిగెల వెంట అధికారులు, సిబ్బంది తిరుగుతూ యజమానులకు నేరుగా రోడ్డు విస్తరణ పనుల విషయాన్ని తెలిపారు. సంవత్సరం క్రితం ఆర్అండ్బీ అధికారులు మార్కింగ్ చేసిన ప్రాంతం వరకు వారం, పది రోజుల్లో కట్టడాలను తొలగించుకోవాలని, లేని పక్షంలో మునిసిపల్ సిబ్బంది రంగంలోకి దిగి కట్టడాలను తొలగిస్తారని అధికారులు వివరించారు.
మొదటి విడతలో..
మొదటి విడతలో 65వ నంబరు జాతీయ రహదారి నుంచి సీతారామ చంద్ర స్వామి దేవాలయం వరకు 350 మీటర్ల పొడవున ఇరు వైపుల ఉన్న కట్టడాల ( వ్యాపార మడిగెలు)కు కొలతలు వేశారు. ఇప్పటికే ఈ రోడ్డును 350 మీటర్ల పొడవున ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ నిర్మాణం చేశారు. దీనికి అదనంగా ఇరు వైపుల మూడున్నర మీటర్ల వెడల్పుతో అనగా ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ నిర్మాణం చేయనున్నారు. మొత్తంగా 14 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం జరగనుంది. రోడ్డు మధ్య నుంచి అటు వైపు 33 అడుగులు, ఇటు వైపు 33 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. మొత్తంగా 66 అడుగుల వెడల్పుతో ఉండే విధంగా ఈ రోడ్డును విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు ఇరు వైపులా మురుగు కాలువల నిర్మాణం, డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. చెరువు నంచి వచ్చే అలుగు నీరు సజావుగా వెళ్లి పోయేలా కాలువల నిర్మాణాలను చేపట్టనున్నారు.
కొందరి ఆమోదం.. మరికొందరి ఖేదం
రోడ్డు విస్తరణ పనులకు గాను 10నుంచి 15 మంది మడిగెల యజమానులు స్వచ్ఛందంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రోడ్డు విస్తరణ కోసం కొలతలు వేసేందుకు వెళ్లిన మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, ఆర్అండ్బీ డీఈఈ సైనాజ్లకు యజమానులు తెలిపారు. ఏడాది క్రితం మార్కింగ్ పెట్టినప్పటి నుంచి మడిగెలకు రంగులు వేసుకోలేదని, రోడ్డు విస్తరణ కోసం తొలగించే నిర్మాణాలకు రంగులు వేయడం వృథా అని, అలాగే ఉంచామని వారు తెలిపారు. మడిగెలు, భవనాలు దెబ్బతినకుండా ఉండేందుకు మార్కింగ్ చేసిన వరకు కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకుంటామని కొంత మంది యజమానులు తెలిపారు. మరి కొందరు యజమానులు కట్టడాల తొలగింపు చర్యలను వ్యతిరేకించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండ కట్టడాలను ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో నిర్మాణాలను చేసిన కట్టడాల యజమానులకు నోటీసులను జారీ చేయవలసిన అవసరం లేదని, ఇవి అక్రమ నిర్మాణాల కిందకు వస్తాయని డీఈఈ శైనాజ్ స్పష్టం చేశారు. అనవసరపు వివాదాలకు వెళ్లకుండా రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని కమిషనర్, డీఈఈలు కోరారు.
ట్రాిఫిక్జాంతో ఇక్కట్లు
పట్టణంలోని చిన్నకొండూరు రోడ్డులో నిత్యం నెలకొంటున్న ట్రాఫిక్జాంతో వాహనదారులు, పాదాచారులు అనేక ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తోంది. జాతీయ రహదారి నుంచి సుమారు 500 మీటర్ల పొడవునా వ్యాపార సంస్థలు ఉండడంతో పార్కింగ్ చేసే వాహనాలతో ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనాలు ఇటు నుంచి అటు వెళ్లేందుకు అరగంట సమయం పడుతోంది. చౌటుప్పల్ నుంచి జిల్లా కేంద్రమైన భువనగిరికి వెళ్లే ఈ రోడ్డు పై వాహనాల రాక పోకలు పెరగడంతో రద్దీ నెలకొంది. ఇక్కడ నెలకొంటున్న ట్రాపిక్ సమస్య పోలీసులకు సమస్యగా మారింది. దీనికి రోడ్డు వెడల్పు చేయడం ఒక్కటే పరిష్కారమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులను శీఘ్రగతిన పూర్తి చేసి రాకపోకలకు మార్గం సుగమమం చేయాలని, ట్రాఫిక్జాం సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
50 సంవత్సరాల భవిష్యతకు అనుగుణంగా
50 సంవత్సరాల భవిష్యతను దృష్టిలో పెట్టుకొని హైవే నుంచి చిన్నకొండూరుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ను 66 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు నిర్ణయించామని మునిసిపల్ చైర్మన వెనరెడ్డిరాజు తెలిపారు. వాస్తవంగా ఈ ఆర్అండ్బీ రోడ్డును నిబంధనల ప్రకారంగా 100 అడుగుల వెడల్పుతో విస్తరించవలసి ఉందని, వ్యాపార మడిగెలు, నివాస గృహాల యజమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని 66 అడుగులకు తగ్గించామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, చౌటుప్పల్ పట్టణం మరింతగా అభివృద్ది చెందేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. 15రోజుల్లో రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రతీ ఒక్కరు సహకరించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
Updated Date - Jun 25 , 2024 | 12:39 AM