పత్తి సాగు ముమ్మరం
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:06 AM
చౌటుప్పల్ మండలంలోని రైతులు గురువారం నుంచి పత్తి విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు.
బలమైన కార్తె.. అదునులో వర్షం
విత్తనాలు విత్తే పనిలో రైతులు బిజీ
చౌటుప్పల్ టౌన, జూన 7: చౌటుప్పల్ మండలంలోని రైతులు గురువారం నుంచి పత్తి విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి సుమారు మూడు వేల మంది రైతులు పత్తి పంట సాగును ముమ్మరం చేశారు. రోహిణి కార్తెలో విత్తనాలను విత్తితే వంగడాలు బలంగా ఉండడంతో పాటు దిగుబడులు అధికంగా వస్తాయన్నది రైతుల ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగా ఈ కార్తిలో విత్తనాలను విత్తేందుకు రైతులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రోహిణికార్తె ఈ నెల 7తో ముగుస్తుండడంతో పత్తి విత్తనాలను విత్తే పనులను వేగవంతం చేశారు.
మండలంలో ఇలా..
మండలంలో ప్రధానంగా కాట్రేవు, ఆరెగూడెం, పంతంగి, ఎస్.లింగోటం, జైకేసారం, నేలపట్ల, మందోళ్లగూడెం, చిన్నకొండూరు, పెద్దకొండూరు, శేరిల్ల్ల , మశీద్ గూడెం, చింతలగూడెం, తంగడపల్లి తదితర గ్రామాల్లో సిద్దం చేసిన దుక్కులలో రైతులు పత్తి విత్తనాలను విత్తుతున్నారు. ఈ సంవత్సరం సుమారు 17 నుంచి 18వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేసే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గత సంవత్సరం 4728 మంది రైతులు 10 వేల ఎకరాలలో మాత్రమే రైతులు పత్తి సాగు చేయగా, ఈ సారి నెలకొన్న సాగు నీటి సమస్యతో వరి పంటను రైతులు కొంత మేరకు తగ్గించుకుని పత్తి సాగును పెంచనున్నారు. వరి సాగుతో పోల్చుకుంటే పత్తి సాగు లాభదాయకంగా ఉండడంతో పాటు రిస్క్ కూడా కాస్త తక్కువగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. వరి సాగుకు నీరు ఎక్కువగా అవసరం ఉండగా, పత్తి సాగు వర్షాధారంపై ఆధారపడి ఉంటుంది. సమయానుకూలంగా ఒక మోస్తరు వర్షాలు కురిస్తే చాలు పత్తి దిగుబడులు ఆశించిన మేరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. విత్తనాల కొనుగోలుపై వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.
అధీకృత డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాలి
రైతులు అధీకృత డీలర్ల వద్దనే పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలి. పత్తి విత్తనాల ఖాళీ ప్యాకెట్తో పాటు విత్తనాల కొనుగోలు రశీదులను పత్తి సీజన ముగిసే వరకు భద్రపరచుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సస్య రక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులను సాధించాలి. గ్రామాల్లో విక్రయించే లూజ్ పత్తి విత్తనాలను వాడకూడదు. నకిలీ పత్తి విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నకిలీ పత్తి విత్తనాల సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలి.
-ముత్యాల నాగరాజు, ఏవో, చౌటుప్పల్
Updated Date - Jun 08 , 2024 | 12:06 AM