చెరువును కమ్మేసిన గుర్రపు డెక్క
ABN, Publish Date - May 14 , 2024 | 11:08 PM
సంగారెడ్డి రూరల్, మే 14: మత్స్యకారులు, రజకులకు ఆ చెరువే జీవనాధారం. అలాంటి చెరువు పూర్తిగా గుర్రపుడెక్కలతో నిండిపోయింది.
ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు, రజకులు
తొలగించి ఆదుకోవాలని వేడుకోలు
సంగారెడ్డి రూరల్, మే 14: మత్స్యకారులు, రజకులకు ఆ చెరువే జీవనాధారం. అలాంటి చెరువు పూర్తిగా గుర్రపుడెక్కలతో నిండిపోయింది. దీంతో మత్స్యకారులు, రజకులకు ఉపాధి కరువై కుటుంబపోషణ భారమైపోయి పూటగడవని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని వినాయక్సాగర్ చెరువులో మత్స్యకారులు చేపలను పడుతూ జీవనం సాగిస్తుండగా.. రజకులు దుస్తులు ఉతుకుతూ (శుభ్రం చేస్తూ) ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా వేసవి విడిదిలో పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు చెరువులో చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు షికారు చేసేలా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బోటును ఏర్పాటు చేశారు. బోటు నిర్వహణ చూసుకునే వారికి కూడా ఉపాధి కల్పించారు. కొంతకాలంగా చెరువులో గుర్రపుడెక్కలు పేరుకుపోవడంతో పలువురి ఉపాధికి గండిపడిందని చెప్పవచ్చు. గతంలో గుర్రపు డెక్కలను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి విన్నవించగా హైదరాబాద్ నుంచి మిషనరీని తెప్పించి తొలగించారు. కానీ కొంతకాలానికే తిరిగి గుర్రపు డెక్కలు మొలిచి చెరువు మొత్తం వ్యాపించాయి. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులు, రజకులు చేసేది లేక బట్టలు ఉతికేందుకు స్వయంగా చేతులతోనే గుర్రపు డెక్కలను తొలగిస్తున్నారు. బట్టలు ఉతికితేనే తమ పొట్టనిండుతుందని తాము చేతులతో తీసివేసినా తిరిగి వస్తున్నాయని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్కల కింద చేపపిల్లలు ఊపిరాడక మృతిచెందుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఇదిలా ఉండగా వేసవిలో సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదాగా బోటులో విహరిద్దామని ఎంతో ఆశగా ఇక్కడికి వస్తే బోటు వెళ్లకుండా చెరువు మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి ఉన్నది. దీంతో వారు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారులు స్పందించి చెరువులో గుర్రపు డెక్కను తొలగించాలని మత్స్యకారులు, రజకులు, స్థానికులు కోరుతున్నారు.
Updated Date - May 14 , 2024 | 11:08 PM