తాగునీటి కోసం రాస్తారోకో
ABN, Publish Date - Jul 15 , 2024 | 10:49 PM
ఒక వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఖాళీ బిందెలతో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింతలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆరు, ఏడో వార్డుల్లో గల పలు ప్రాంతాల్లో నాలుగు నెలలుగా తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు, ఆయా కాలనీలవాసులు ఆత్మకూరు-మరికల్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు.
అమరచింతలో బిందెలు పట్టుకొని రోడ్డెక్కిన మహిళలు
నాలుగు నెలలుగా ఎద్దడి నెలకొన్నదని ఆవేదన
మూడు గంటల పాటు స్తంభించిన వాహనాల రాకపోకలు
అమరచింత, జూలై 15: ఒక వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఖాళీ బిందెలతో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింతలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆరు, ఏడో వార్డుల్లో గల పలు ప్రాంతాల్లో నాలుగు నెలలుగా తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు, ఆయా కాలనీలవాసులు ఆత్మకూరు-మరికల్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని తీర్చాలని నాలుగు నెలలుగా మునిసిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఒకవైపు వర్షాలు పడుతున్నా తమ కాలనీకి గుక్కెడు నీళ్లు రావడం లేదన్నారు. మునిసిపల్ అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించబోమని భీష్మించారు. దాంతో దాదాపు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా విరమించ లేదు. దాంతో పోలీసులు మునిసిపల్ అధికారులను అక్కడికి రప్పించారు. మునిసిపల్ అధికారి కృష్ణయ్యను కాలనీలవాసులు చుట్టుముట్టి, వాగ్వాదానికి దిగారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీలవాసులు మణెమ్మ, రాధ, ఎల్ఐసి రాజన్న, అజయ్, బీసీ దామోదర్, మక్బుల్, తెలుగు రమేష్, కురువ రఘు, రామలింగం, మేస్త్రీ రామకృష్ణ, శ్రీను, క్యామ నాగేష్, శ్రీకాంత్, బద్రి, శ్రీను, వీరేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 10:49 PM