‘విశ్వకర్మ యోజన’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:38 PM
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ
- టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం
గద్వాల, సెప్టెంబర్ 3 : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. విశ్వకర్మ యోజన పథకం కింద గద్వాల పట్టణంలోని ఎస్వీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశ్వకర్మలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ది చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వం పీఎం విశ్వకర్మ డిజిటల్ ధ్రువపత్రాలను అందిస్తుందని తెలిపారు. టైలరింగ్లో ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు రూ. 15 వేల విలువైన టూల్కిట్, ఐదు వందల రూపాయలు ఇస్తారని తెలిపారు. వడ్రంగులు, కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, మేస్ర్తీలు, చాపలు, చీపుర్లు తదితర చేతివృత్తిదారులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. సాంప్రదాయ హస్తకళలను, కళాకారుల నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇది ఎంతో ఉపయోకరమని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, నాయకులు బల్గెర శివారెడ్డి, దాసు, రజక నర్సింహ, కిష్టన్న, డబ్బులేటి నర్సింహ, చిత్తారి కిరణ్ పాల్గొన్నారు.
Updated Date - Sep 03 , 2024 | 10:38 PM