అభివృద్ధిని పట్టించుకోని వారికి గుణపాఠం చెప్పాలి
ABN, Publish Date - Apr 27 , 2024 | 01:05 AM
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు.
ఇల్లంతకుంట, ఏప్రిల్ 26: అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో శుక్రవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీలుగా పనిచేసిన వినోద్కుమార్, బండి సంజయ్కుమార్ ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. దేవుడి పేరుతో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కనీస పరిజ్ఞానం లేని సంజయ్కుమార్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశంగా పాలన కొనసాగించారన్నారు. అభివృద్దే ధ్యేయంగా పనిచేయడానికి వస్తున్న తనను ఆదిరించాలని కోరారు. రైతుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని, కొంతమంది నాయకులు చేసే ప్రకటనలు నమ్మవద్దన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తు సంతోషంగా ఉన్నారన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.
సైదాపూర్, ఏప్రిల్ 26: గడిచిన పది సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో సైదాపూర్ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్కేపల్లి గాంధీ విగ్రహం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటీంగ్లో మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యానని, ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాహుల్ గాంఽధీ ప్రధాని కావాలంటే ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసీ రాజేందర్రావును అధిక మెజారిటీతో గెలింపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక పిల్లి శాపనార్ధీలు పెడుతున్నదన్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని, హరీష్రావు రాజీనామాతో సిద్దంగా ఉండాలని, అగ్గిపెట్టె రాజకీయం చేయొద్దన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మానంకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, గుండారపు శ్రీనివాస్, మిట్టపెల్లి కిష్టయ్య పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెలబెట్టుకుంటాం..
చిగురుమామిడి: రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంతో కొట్లాడి మనకు రావాల్సిన నిదులు తీసుకు వచ్చే వ్యక్తి రాజేందర్రావు అన్నారు. ఆయనను ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంటు నియెకవర్గ ఇన్చార్జి బత్తిని శ్రీనివాస్గౌడ్, మహిళ అధ్యక్షురాలు పోలు స్వప్న, జడ్పీటీసీ గీకురు రవీందర్, మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, మురళిగౌడ్, ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, చిట్టుమల్ల రవీందర్, కర్ణకంటి మంజులారెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఊరికి కాలువల ద్వారా సాగునీరందిస్తా
కరీంనగర్ అర్బన్: కోహెడ మండలంలోని ప్రతి గ్రామానికి కాలువల ద్వారా సాగునీరందించే బాధ్యత తనదని, కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోహెడ మండలంలో భవిష్యత్లో రైతులకు సాగు నీరు, ఉద్యోగాలు తెస్తామన్నారు. మహిళలంతా కాంగ్రెస్కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదని, వినోద్రావు ఎప్పుడైనా కోహెడ మండలానికి వచ్చాడా, బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లో పర్యటించాడా.. అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రతి సమస్యకు పరిష్కారం చూపామని, తాగు నీటికి ఇబ్బందులు రావద్దన్ని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఫ అవకాశం ఇవ్వండి.. అందరికీ సేవ చేస్తా..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ ప్రభాకరన్నను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతానని, ఎంపీగా అవకాశం ఇస్తే అందరికీ సేవ చేస్తూ తరిస్తాను అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిత్యావసారాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటుందన్నారు.
Updated Date - Apr 27 , 2024 | 01:05 AM