నత్తనడకన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు...
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:58 PM
పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రెండేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదనే ఉద్దేశ్యంతో బస్టాండ్ సమీపంలోని ఐబీ గెస్ట్హౌస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదించారు.
హుజూరాబాద్, సెప్టెంబరు 10: పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రెండేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదనే ఉద్దేశ్యంతో బస్టాండ్ సమీపంలోని ఐబీ గెస్ట్హౌస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదించారు. అందులో ఆర్డీవో కార్యాలయం ఉండగా, ఖాళీ చేయించి రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. దీనికి మొదటి విడతలో 4.5 కోట్లు విడుదలయ్యాయి. మిగితా 4.5 కోట్లకు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. సదరు కాంట్రాక్టర్ ఈ పనులను అతని వీలు ప్రకారమే పనులు చేపడుతున్నాడనే విమర్శలున్నాయి. హుజూరాబాద్ పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటే బాగుంటుందని మున్సిపల్ పాలకవర్గం ఆమోదించింది. రెండెకరాల స్థలంలో 102 కూరగాయల దుకాణాలు, 40 మటన్, ఫిష్ దుకాణాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సదరు కాంట్రాక్టర్ పనులను అసంపూర్తిగా వదిలేశారు. బిల్లులు రానందుకే పనులు నిలిపివేశాడని తెలిసింది. ప్రస్తుతం కూరగాయల మార్కెట్ మున్సిపల్ సమీపంలో కొనసాగుతుండడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ ఏఈ సాంబరాజును వివరణ కోరగా నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అవి రాగానే పనులు పూర్తి చేయిస్తామన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:58 PM