బడి బస్సు భద్రమేనా?
ABN, Publish Date - Jun 09 , 2024 | 12:33 AM
ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
జగిత్యాల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విధిగా విద్యార్థులకు భద్రతపై భరోసా కల్పించాలని సూచిస్తు న్నారు. పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, వాహనాలు రహదారులపైకి వచ్చే లోపు ఫిట్నెస్ చేయించుకోకుంటే ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులను తరలించడానికి వినియోగిస్తున్న పాఠశాలల వాహనాల ఫిట్నెస్పై చాలా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. విద్యాసంస్థల బస్సులకు ప్రతి సంవత్సరం ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాను న్నాయి.
జిల్లాలో పాఠశాల వాహనాలు :
జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన బస్సులు 462 ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 302 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. మరో 160 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. అయితే జిల్లాలో మరో 220 పాఠశాల వాహనాలు 15 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకొని కాలం చెల్లి ఉండడంతో వాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఒక్కో ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ. 5వేలు ఖర్చవుతుంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూల్ యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి.
జిల్లాలో 293 ప్రైవేటు పాఠశాలలు :
జిల్లా వ్యాప్తంగా 293 వివిధ ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో 15 ప్రాథమిక పాఠశాలలు, 149 ప్రాథమికోన్నత పాఠశాలలు, 129 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 68,019 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 3,689 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పిల్లలను పాఠశాలల నుంచి తీసుకువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన అవసరమైన బస్సుల నిర్వహణలో యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.
తనిఖీలు చేస్తున్నా.. తప్పించుకుంటూ వినియోగం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు, పోలీసులు పాఠశాలల బస్సులను తనిఖీలు చేస్తున్నారు. అయితే ముందుగానే సమాచారం తెలుసుకుంటున్న పాఠశాల యాజామాన్యాలు తప్పించుకుంటూ వాహనాలను ఇతర మార్గాల్లో వినియోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సులకు ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యధేచ్ఛగా రోడ్లపై తిప్పుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఇలా :
వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబం ధించిన వివరాలు, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండర్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా 325 మిల్లీమీటర్ల. ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. వాహనం టైర్లు, బ్రేకులు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందినదో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉండాలి. పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి.
ఫిట్నెస్ లేకుంటే చర్యలు
- వంశీధర్, జిల్లా రవాణా శాఖ అధికారి, జగిత్యాల
అనుమతులు లేకుండా పాఠశాల యజమానులు స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్గా నియమించు కోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు పునఃప్రారంభించి బస్సులను రహదారులపైకి తీసుకవచ్చేలోపు ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాఠించకుంటే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం.
Updated Date - Jun 09 , 2024 | 12:33 AM