కాంగ్రెస్ గూటికి ‘గంగుల’?
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:45 AM
మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రచారం కలవరం కలిగిస్తున్నది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరిన నేపథ్యం మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు అత్యంత కీలకమైన నేత పార్టీని వీడనున్నారని వస్తున్న సమాచారం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
- జోరుగా సాగుతున్న ప్రచారం
- అసెంబ్లీ లాబీల్లో కవ్వంపల్లి వాఖ్యలతో కలకలం
- ప్రతిష్ట దిగజార్చేందుకే తప్పుడు ప్రచారమంటున్న గంగుల కమలాకర్
(ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రచారం కలవరం కలిగిస్తున్నది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరిన నేపథ్యం మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు అత్యంత కీలకమైన నేత పార్టీని వీడనున్నారని వస్తున్న సమాచారం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లోని కీలక నేతలను అందులో ముఖ్యంగా శాసనసభ్యులను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ను నామమాత్రపు పార్టీగా మార్చాలనే ఆలోచనతో ఉందని ఆ దిశగా సాగిన మొదటి ప్రయత్నంగా పోచారం పార్టీ మార్పిడిని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గంగులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కీలక వికెట్ను పడగొట్టాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా గంగుల కమలాకర్ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి. అసెంబ్లీ లాబీల్లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో చిట్చాట్ చేస్తూ కమలాకర్ త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారని వాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకున్నది.
ఫ కరీంనగర్లో పుంజుకోవాలని కాంగ్రెస్ యత్నాలు
కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని, పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పెద్దలు జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీ వర్గాల్లో గట్టిపట్టున్న కమలాకర్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయనను చేర్చుకునే ప్రతిపాదనను ఆచరణలో పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించారని సమాచారం. జిల్లాలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్లో ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలోకి వెళ్లారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్కు చెందిన మేయర్ సునీల్రావు ఆ వెనువెంటనే మరో నలుగురు కార్పొరేటర్లు కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ను కలువడంతో వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. కమలాకర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ కార్పొరేటర్లను, ఇతర ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని, జిల్లాలో తిరుగులేని శక్తిగా మారాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి ముఖ్యనేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరడం ఆ పార్టీశ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నది.
ఫ పార్టీ మారను.. బీఆర్ఎస్లోనే ఉంటా..
- మాజీ మంత్రి గంగుల కమలాకర్
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాను కాంగ్రెస్లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొంత కాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారని అంటున్నారని అన్నారు. తాను ఏ పార్టీకి వెళ్లేది లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని తెలిపారు.
Updated Date - Jun 23 , 2024 | 12:45 AM