Harish Rao: పంటల కొనుగోళ్లలో సర్కారు విఫలం
ABN, Publish Date - Nov 04 , 2024 | 04:07 AM
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ ఆదివారం సందర్శించారు.
సీఎం, మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి: హరీశ్ రావు
నంగునూరు, హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కోల్పోయిందని తెలిపారు. వరి కోతలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పుటికీ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్ను వీడి జిల్లాల్లో పర్యటించి రైతుల బాధలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హరీశ్రావు హెచ్చరించారు.
60మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైతే చీమ కుట్టినట్టు లేదా?
గురుకుల పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
Updated Date - Nov 04 , 2024 | 04:07 AM