ఆయిల్ పామ్ సాగుకు ఊతం!
ABN, Publish Date - Aug 19 , 2024 | 12:08 AM
ప్రభుత్వం రైతులను ప్రయత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించే విధంగా చర్యలు చేపడుతున్న సమయంలో రైతులు ఆయిల్ పామ్ సాగు పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆయిల్ పామ్ సాగుకు ఏయే మండలాలు అనుకూలంగా ఉన్నాయనేది అధికారులు గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాలన్న లక్ష్యంతో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో ఈ ఏడాది 2 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వం రైతులను ప్రయత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించే విధంగా చర్యలు చేపడుతున్న సమయంలో రైతులు ఆయిల్ పామ్ సాగు పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆయిల్ పామ్ సాగుకు ఏయే మండలాలు అనుకూలంగా ఉన్నాయనేది అధికారులు గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాలన్న లక్ష్యంతో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
వికారాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు గత ప్రభుత్వం 25 జిల్లాలను ఎంపిక చేయగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఆయిల్ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వికారాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మూడేళ్ల కిందటనే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. పుష్కలంగా నీటి వసతి కలిగి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించే పంటల్లో ఒకటైన ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులు కొంతకాలంగా ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొత్త కావడంతో ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహాన్ని వారు ఆశిస్తున్నారు. నీటి వసతి పుష్కలంగా ఉండే ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగునీటి ఎంతో అనుకూలంగా ఉంటాయి. అయిల్ పామ్ సాగు చేస్తే చీడ పీడలు, పురుగులు, క్రిమి కీటకాల బెడద చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ పంటపై రైతుల్లో పెరుగుతోంది. పంట సాగు ప్రారంభించిన తరువాత నాలుగైదు సంవత్సరాలు కష్టపడితే ఆ తరువాత ఎక్కువ శ్రమించకుండానే ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతో పండే ఈ పంట గాలివాన వీచినా ఎలాంటి నష్టం వాటిల్లదు. చీడలు, పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. ఎకరానికి 10టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. ఖర్చులు పోనూ ఎకరాకు లక్ష రూపాయలకు పైగానే ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ఏయే మండలాలు అనుకూలంగా ఉన్నాయనేది ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రయత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించే విధంగా చర్యలు చేపడుతున్న ఈ సమయంలోనే ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జిల్లాలో ఈ ఏడాది 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాలన్న లక్ష్యంతో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి....
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్న రైతులను ప్రోత్సహించాలని పలుమార్లు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాల్లో పలువురు సభ్యులు ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మన వద్ద వంటనూనె వినియోగం అధికంగా ఉంటున్న నేపథ్యంలో విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగుమతి చేసుకుంటున్నారు. వంటనూనెకు ఉపయోగపడే పంటలను పండించే దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రోత్సహకాలు అందజేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించడంతో పాటు అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
603 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి ....
ఈ ఏడాది జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్సాగును ప్రోత్సహించాలని ఉద్యాన వన శాఖ అధికారులు నిర్ణయించగా, ఇప్పటి వరకు 603 ఎకరాల్లోనే ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తి చేశారు. మరో వెయ్యి ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పట్ల అధిక సంఖ్యలో రైతులు ఆసక్తి కనబరుస్తున్నా ఇప్పటి వరకు 162 మంది రైతులు మాత్రమే ప్లాంటేషన్ చేసుకున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులను ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తే జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.
Updated Date - Aug 19 , 2024 | 12:08 AM