Kumaram Bheem Asifabad: ఆగని రేషన్ బియ్యం దందా
ABN, Publish Date - Aug 10 , 2024 | 10:10 PM
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతోంది. పక్కనే మహారాష్ట్ర ఉండడంతో ఇక్కడ తక్కువ ధరకు కొని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
- లబ్ధిదారుల నుంచి సేకరణ.. క్వింటాళ్లుగా విక్రయం
- యథేచ్ఛగా మహారాష్ట్రకు తరలింపు
- కేసులతోనే సరి పెడుతుండడంతో మళ్లీ అదే దందా
- పీడీ యాక్టుకు అవకాశం ఉన్నా దృష్టి సారించని అధికారులు
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతోంది. పక్కనే మహారాష్ట్ర ఉండడంతో ఇక్కడ తక్కువ ధరకు కొని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఒక్కో కుటుంబం నుంచి కిలల లెక్కన కొనుగోలు చేసి క్వింటాళ్ల లెక్కన బయట విక్రయి స్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు తప్పితే లోతుగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
బెజ్జూరు, ఆగస్టు 10: ప్రజాపంపిణీ బియ్యం పక్కదారి పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తరువాత కొన్ని నెలలు వరకు స్తబ్దుగా ఉన్న రేషన్ బియ్యం వ్యాపారులు ఇప్పుడు అక్రమ బియ్యం రవాణాకు తెరలేపారు. రాజకీయ అండదండలతో వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రేషన్బియ్యం సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలు పని చేస్తున్నాయి. చైన్సిస్టంలా పని చేస్తూ ఒకరినుంచి ఒకరు ప్రజల నుంచి బియ్యం సేకరిస్తు న్నారు. వాటిని పెద్దమొత్తంలో సేకరించి మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు రూ.10వరకు కమీషన్ మిగులు తుండటంతో చాలా మంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారు. నిత్యం రవాణా జరుగుతూనే ఉన్నా ఎప్పుడో ఒక్కసారి పట్టుబడటం గమనార్హం.
రవాణా ఇలా..
ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. వీటిని వదిలి బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కొంటున్నారు. ఇంట్లో దొడ్డు బియ్యం తినడం లేదని మరికొంత మంది విక్రయిస్తున్నారు. సగటున కిలోకు రూ.10చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెజ్జూరు, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానేపల్లి తదితర మండలాల్లో రేషన్ దందా జోరుగా కొనసాగుతోంది. ఆయా మండలాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండటంతో కొంతమంది ఇదే పనిగా పెట్టుకొని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ.10నుంచి 15వరకు కొనుక్కొని అక్కడ కిలోకు రూ.20నుంచి 25వరకు అమ్ముకుంటున్నారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాచమార్గంగా మారింది. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు, బొలేరో, ఆటోల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సిర్పూర్ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని అక్కడికి చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంఽధిత అధికారులు తరచూ దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంతమంది రేషన్ ఇచ్చే డీలర్ల వద్ద నుంచే బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలోనే దళారులు లబ్ధిదారుల నుంచి అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రేషన్ డీలర్లు కూడా దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బయటకు రాకుండా ఉండేందుకు దళారుల చేత బియ్యాన్ని సేకరించి వచ్చిన ఆదాయంలో సమంగా పంచుకుంటున్నారని బాహాటంగానే ఆరోపణలు ఉన్నాయి.
తూతూ మంత్రంగా ధర్యాప్తు..
జిల్లాలో రోజుల వ్యవధిలోనే అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన, తరలి స్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. కానీ వాటి మూలాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. పట్టుబడిన వ్యక్తులు ఎక్కడినుంచి వాటిని సేకరించారు. ఎన్ని నెలల నుంచి వ్యాపారం సాగుతోంది. తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు జరగకపోవడం వల్లనే కేసులు నమోదైనా మళ్లీ ఇదే దందా సాగించడమో లేదంటే వారి ప్రతినిధులను ఈ వ్యాపారంలో దింపి వెనుకనుంచి నడిపించడం లాంటివి చేస్తున్నారని తెలుస్తోంది. దొరికిన బియ్యానికి లెక్కలు అడిగి చర్యలు తీసుకుంటున్నారు. తప్పితే వారి వ్యాపార చరిత్రపై ఆరా తీయడం లేదు. ఇప్పటికైనా అధికారులు బియ్యం అక్రమ రవాణాపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం..
- విక్రం ,ఎస్సె, బెజ్జూరు
గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్బియ్యం మహారాష్ట్రకు తరలించే వ్యక్తులపై చర్యలు తప్పవు. బియ్యం నిల్వలు ఉన్నట్లయినా, తరలించినా తమకు సమాచారం అందిస్తే పట్టుకొని కేసులు నమోదు చేస్తాం.
Updated Date - Aug 10 , 2024 | 10:10 PM