గెయిల్ మాజీ చైర్మన్ ప్రసాద్ కన్నుమూత
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:02 AM
ప్రభుత్వ రంగంలోని గెయిల్ (ఇండియా) మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ సీఆర్ ప్రసాద్ (83) మరిక లేరు. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఆయన శనివారం రాత్రి...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని గెయిల్ (ఇండియా) మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ సీఆర్ ప్రసాద్ (83) మరిక లేరు. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేసిన ఆయన నాగర్జునసాగర్ డ్యామ్ నిర్మాణంలో ఇంజనీర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత కొంతకాలం నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్లోనూ పని చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి మారి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో గెయిల్ ఏర్పాటు చేసిన కొత్తలో ఆ సంస్థ మార్కెటింగ్ అండ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్గా చేరారు. తర్వాత 1996 సెప్టెంబరులో గెయిల్ (ఇండియా) సీఎండీగా బాధ్యతలు చేపట్టి 2001 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఇంధన రంగంలో అపార అనుభవం ఉన్న ప్రసాద్.. ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్ గ్యాస్ కంపెనీల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. కార్పొరేట్ రంగంలో సీఆర్పీగా సుపరిచితులైన ఆయన ప్రభుత్వ రంగంలోని పలు ఇంధన సంస్థల ప్రముఖులకు గురుతుల్యులు.
Updated Date - Jul 15 , 2024 | 03:02 AM