శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ప్రమోటర్, పారిశ్రామికవేత్త శరత్ గోపాల్ కన్నుమూత
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:51 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త బొప్పన శరత్ గోపాల్ శుక్రవారం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్, జూబ్లీహిల్స్ విస్పర్వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియ లు నిర్వహించనున్నారు. విద్య, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో శరత్ గోపాల్ తనదైన ముద్ర వేశారు.
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త బొప్పన శరత్ గోపాల్ శుక్రవారం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్, జూబ్లీహిల్స్ విస్పర్వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియ లు నిర్వహించనున్నారు. విద్య, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో శరత్ గోపాల్ తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్, కొత్తగూడలో ఆయన నిర్మించిన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద మాల్గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆయన స్థాపించిన మ్యాట్రిక్స్ లేబొరేటరీస్ బల్క్డ్రగ్స్ తయారీలో అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెంజెండాలో 1949లో జన్మించిన శరత్ గోపాల్.. వరంగల్ ఎన్ఐటీ నుంచి 1974లో మెటలర్జీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1978లో ప్రీమియర్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. అనంతరం 1988లో మ్యాట్రిక్స్ లేబొరేటరీస్ను ప్రారంభించారు. 1991లో డైమ్స్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. ఈ సంస్థ కెమికల్ ప్రాసెస్ మెషినరీ తయారీలో కీలకంగా ఉంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1995లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈఈపీసీ నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కొండాపూర్లో ఏ గ్రేడ్ ఐటీ బిల్డింగ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విద్యలో కీలకమైన విద్యాసంస్థగా ఉన్న వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీని శరత్ గోపాల్ స్థాపించారు.
Updated Date - Jul 20 , 2024 | 05:51 AM