ఓఎన్జీసీకి మరో అధునాతన రిగ్
ABN, Publish Date - Aug 21 , 2024 | 05:34 AM
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్స్ మార్కెట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని...
మేఘా ఇంజనీరింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్స్ మార్కెట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీకి మరో అధునాతన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ను సరఫరా చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఫుల్లీ ఆటోమేటెడ్, హైడ్రాలిక్ 2000 హెచ్పీ రిగ్ను ఓఎన్జీసీ రాజమండ్రి ప్రాంతంలో చమురు, సహజ వాయువు అన్వేషణకు ఉపయోగించనుంది. తీవ్రమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లోనూ ఈ డ్రిల్లింగ్ రిగ్ సాయంతో 6,000 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయవచ్చు. చమురు, సహజవాయువు కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏర్పడే బ్లోఅవుట్స్ను అదుపు చేసేందుకూ ఈ రిగ్లో ప్రత్యేక ఏర్పాటు ఉందని ఎంఈఐఎల్ తెలిపింది. కేవలం ఇద్దరి సహాయంతో ఈ రిగ్ను ఆపరేట్ చేయడం మరో ప్రత్యేకత. ఆత్మనిర్భర్ భారత్ కింద ఎంఈఐఎల్ ఈ అధునాతన రిగ్లను తయారు చేస్తోంది. అంతర్జాతీయ పోటీని తట్టుకుని ఓఎన్జీసీకి మొత్తం 47 డ్రిల్లింగ్ రిగ్లు సరఫరా చేసే కాంట్రాక్టును ఎంఈఐఎల్ దక్కించుకుంది.
Updated Date - Aug 21 , 2024 | 05:34 AM