ఉలికిపాటు..
ABN, Publish Date - May 31 , 2024 | 12:09 AM
గురువారం మధ్యాహ్నం 12.41 గంటల ప్రాంతం లో ఒక ప్రేమోన్మోది ఓ యువతిపై కత్తితో పాశవికంగా నరికి చంపిన వార్త ఏలూరు వాసులను ఉలిక్కిపడేలా చేసింది.
ఏలూరులో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
అక్కడికక్కడే మృతి.. ఆపై యువకుడు ఆత్మహత్యాయత్నం
ఏలూరు క్రైం, మే 30: ఎన్నికల్లో గెలుపోటములపై అంతటా చర్చ నడుస్తోంది. కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు, బందోబస్తు నిర్వహణపై పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.41 గంటల ప్రాంతం లో ఒక ప్రేమోన్మోది ఓ యువతిపై కత్తితో పాశవికంగా నరికి చంపిన వార్త ఏలూరు వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఏలూరు సత్రంపాడులోని ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్(స్వీటీ) (23) అనే యువతి ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి కుదిరి ఈ నెల 26న నిశ్చితార్ధం, జరిగింది. వచ్చేనెల 16న వివాహం జరగనుంది. అయితే ఆమెతోపాటు డిగ్రీ చదివిన ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం తరచుగా ఆమెను ప్రేమ పేరిట వేధించాడు. నిరాకరించడంతో చివరకు గురువారం ఆమె పని చేసే కాలేజీ వద్దకు చేరుకున్నాడు. అక్కడే బ్యాంకులో ఉన్న ఆమెను మాట్లాడాలని చెప్పి పక్క వీధిలోకి తీసుకువెళ్ళి కత్తితో దాడికి తెగబడడంతో మృతి చెందింది. ఆపై అతను అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయ త్నించాడు. అతన్ని పోలీసులు విజయవాడ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్వీటీ తల్లిదండ్రులైన రామారావు, రాజ్యలక్ష్మి తమ కుమార్తెకు వివాహం జరుగుతుందని ఎంతో ఆనందపడ్డారు. వచ్చే నెలలో పెళ్ళి చేసి అత్తవారింటికి పంపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘటన వారిని హతాశులు చేసింది. విషయం తెలిసిన వెంటనే తల్లి కుప్పకూలి పడిపోయింది. కుటుంబ సభ్యులతోపాటు బంధు వులు తల్లడిల్లిపోయారు. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుడు యువతిపై యాసిడ్ దాడి
ప్రశాంతంగా ఉండే ఏలూరు నగరంలో జరిగిన ఈ ఘట నతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే రోజుల్లో ఒక డెంటల్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యడ్ల ప్రాంచికను కూడా ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. తనమాట వినలేదని ఇద్దరు యువకులను కిరాయికి మాట్లాడుకుని ఆమెను హతమార్చడానికి పథకం రచించాడు. రాత్రి వేళ డెంటల్ ఆస్పత్రి నుంచి ఇంటికి తన స్కూటర్పై వెళ్తుండగా ఆమె ఇంటి సమీపంలోనే ఇద్దరు అగంతకులు యాసిడ్ దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ఆమె కొట్టు మిట్టాడుతూ ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందింది. దాడి చేసిన ఇద్దరితోపాటు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురికి జీవిత ఖైదు శిక్ష విధించడంలో పోలీస్ శాఖ చేసిన కృషి రాష్ట్ర స్థాయిలోనే ప్రశంసంలు పొందింది.
సోషల్ మీడియా ప్రభావం
టీనేజ్లో ఉన్న యువతీ యువకులు సోషల్ మీడియాలో వివిధ రకాల మాధ్యమాల్లో వచ్చే రీల్స్పైన మోజు పడి తాము ఆ రీల్స్ లైక్లతో ఉప్పొంగిపోతూ ఆకర్షణకు గురవుతు న్నారు. వారి రీల్స్ను ఆసరా చేసుకుని కొంత మంది వారిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఆపై వారి ప్రాణాలే తీయడా నికి వెనుకాడడం లేదు. మరికొందరు అవసరాలు తీర్చుకుని మోసగిస్తున్నారు. ప్రపంచమే తమ చేతిలో ఉన్నట్లుగా మొబైల్ పట్టుకున్న వారు టైమ్పాస్కో, కాలయాపన కోసం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చార్ట్ వంటి వాటితో స్నేహాలు పెంచుకుంటున్నారు. ఈ స్నేహాలు వెనుక మోసాలు ఉన్నాయని గ్రహించలేకపోతున్నారు. దీంతోనే వారు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తమ బిడ్డలకు జరిగే వాటిని తట్టుకోలే తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందు తున్న సమాజంలో ఇంత దారుణాలకు వడిగట్టేవారు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా తల్లిదండ్రులే తమ పిల్లల కదలిక లపై ఒక కన్ను వేసి వారికి మంచి స్నేహితులుగా సమాజ పరిస్థితులను వివరించి చెప్పాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
టీనేజ్లో ఆకర్షణకు లోనై చివరకు..
టీనేజ్లో తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు లోనై స్నేహితులుగా మారి ఆపై ప్రేమ అంటూ భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. చివరకు చాలా మంది రకరకాల కారణాలతో విడిపోతున్నారు. కొంత మంది సజావుగానే స్నేహితులుగా మిగిలిపోతుండగా మరికొందరు వెంటపడి యువతులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రేమించకపోతే చివరకు ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. గురువారం హత్య చేసిన ఏసురత్నం ఉదంతమే ఇందుకు ఉదాహరణగానే నిలుస్తుంది. మంచి స్నేహితు డిగా ఉన్నాడనుకున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రేమ అంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో చివరకు హతమార్చాడు. ఈ ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. వేరే యువకులతో తమ పిల్లలు స్నేహం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మాయలో పడి.. మోసపోయి..
పీజీ చదువుతున్న ఏలూరు నగరానికి చెందిన ఒక విద్యార్థినికి ఒక యువకుడు మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి కొంత బంగారాన్ని, లక్షల రూపాయ లను అపహరించిన ఘటనపై కొన్నేళ్ల క్రితం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఏలూరుకు చెందిన ఒక యువతి కాకినాడలో బీటెక్ చదువుతుండగా దుగ్గిరాలకు చెందిన ఒక యువకుడు ప్రేమ పేరుతో ఆమెను పరీక్షలు రాయనీయకుండా ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి మరిగిన నూనెలో రెండు చేతులు కాల్చివేశాడు. ఏడాది క్రితం ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో భీమడోలులోని ఒక జూనియర్ కాలేజీలో చదువుతు న్న యువతిని ఒక యువకుడు ప్రేమ పేరుతో వారిద్దరూ ఏకాంతంగా గడపడానికి కామవ రపుకోట మండలం జీలకర్రగూ డెం బౌద్ధా రామాలు కొండపైకి వెళ్ళారు. కొండపై వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా ఉడతలు పట్టే చెంచుల ముఠా వారిద్దరిపై దాడి చేసి ఆ యువతిని హత మార్చారు. ఆ యువకుడిని చావ బాదారు. ప్రాణాపాయ పరిస్థితి లో ఆస్పత్రిలో చేరి మృత్యువాత నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనలో హంతకులను అరెస్టుచేశారు. ఈ కేసు విచారణ ఏలూరు జిల్లా కోర్టులో కొనసాగుతోంది.
Updated Date - May 31 , 2024 | 12:09 AM