వైసీపీ నేతకు టీడీఆర్ ఉచ్చు
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:15 AM
తాడేపల్లిగూడెంలో టీడీఆర్ బాండ్ల జారీలో సిఫారసు చేసిన అధికారులు హాయిగా ఉన్నారు. లబ్ధిపొందన వైసీపీ నేత ఎదురుదాడి చేస్తున్నారు. బయటకు వెల్లడించిన కూటమి నేతలపై నిందలు మోపుతున్నారు.
సీబీ సీఐడీకి అప్పగించాలని కూటమి పట్టు
ఒకే స్థలంపై కమిటీ దర్యాప్తు
యజమానికి కాకుండా బిల్డర్కు బాండ్లు
మున్సిపాలిటీకి రిజిస్ర్టేషన్ చేయడమూ తప్పిదమే
అధికారుల వెన్నులో వణుకు
కూటమి నేతలతో సంప్రదింపులు
రాజీకి యత్నాలు..బలైపోయామంటూ ఆవేదన
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెంలో టీడీఆర్ బాండ్ల జారీలో సిఫారసు చేసిన అధికారులు హాయిగా ఉన్నారు. లబ్ధిపొందన వైసీపీ నేత ఎదురుదాడి చేస్తున్నారు. బయటకు వెల్లడించిన కూటమి నేతలపై నిందలు మోపుతున్నారు.కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇప్పుడు తనకేమీ కాదన్న ధీమా ఒలకబోస్తున్నారు. తాడేపల్లిగూడెంలో రహదారుల విస్తరణ పేరుతో టీడీఆర్ బాండ్ల జారీపై సీబీసీఐడి దర్యాప్తు చేపట్టాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. పట్టణంలో దాదాపు రూ.150 కోట్ల విలువైన బాండ్ల జారీలో వైసీపీ నేత భారీగా లబ్ధిపొందారు. ఆయన కనుసన్నల్లోనే బాండ్లు జారీ అయ్యాయి. స్థల యజమానులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. మాస్టర్ ప్లాన్ రహదారి వద్ద తమ స్థలానికి కొంతమేర ముట్టిందంటూ పలువురు స్థల యజమానులు గుంభనంగా ఉన్నారు. స్థల యజమానులకు మభ్యపెట్టి టీడీఆర్ బాండ్లు జారీ చేసిన ఉదంతం ఇప్పుడు అధికార వర్గాల్లో కాకపుట్టిస్తోంది. తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో సుమారు 1400 గజాలకు టీడీఆర్ బాండ్లు జారీ విషయమై జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. స్థల యజమానులకు అక్కడ ఎటువంటి లబ్ధి చేకూరలేదు. బిల్డర్తో పాటు, అధికార పార్తీ నేత కూడా మోసం చేశారు. మధ్యవర్తి కూడా పెద్ద మొత్తంలో లబ్ధిపొందారు. మహిళా ఐఏఎస్కు భారీ ముడు పులు అందాయి. వారంతా ఇప్పుడు దర్జా ఒలకబోస్తున్నారు. బాండ్లు జారీ చేసిన అధికారుల వెన్నులో మాత్రం వణుకు పుడుతోంది.
కొంపముంచిన ధీమా
మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాయే తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారుల కొంప ముంచింది. ఉన్నతాధికారులు సైతం సిఫారులకు వెనుకాడ లేదు. వైసీపీ నేత ఆగడాలకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. కమిషనర్లు టీడీఆర్ బాండ్లపై హకుం జారీ చేశారు. మున్సిపల్ అధికారులు సైతం తలాడించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తమను ఎవరూ ఏమీ చేయ లేరన్న ధీమాతో బాండ్లు జారీచేశారు.తాడే పల్లిగూడెంలో మంజూ రైన టీడీఆర్ బాండ్ల విలువ రూ. 150 కోట్ల మేర ఉంటుంది. వాటిని రూ.60 కోట్లకు విక్రయించారు.అందులో మూడొంతుల మేర వైసీపీ నేత లబ్ధిపొందారు. కేవలం మీడియా అల్లర చేస్తుందంటూ ఇప్పుడు సదరు నేత అక్కసు వెళ్లబోస్తున్నారు. నిజాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాండ్లు మంజూరు చేసిన అధికారులు మాత్రం వణికిపోతున్నారు. తమకు వేటు తప్పదన్న భావనకు వచ్చేశారు. దాంతో కూటమి నేతలతో సంప్ర దింపులు జరుపుతున్నారు. తాము తీసుకున్న సొమ్ములను ఇచ్చేస్తామంటూ రాయబారాలు నెరపు తున్నారు. కానీ కొద్దిపాటి లబ్ధి పొంది బాండ్లు మంజూరు చేసేశారు. వైసీపీ నేతకు కోట్ల లబ్ధిపొందేలా చేశారు. ఇప్పుడు అధికారులపై వేటు కత్తి వేలాడేలా చేసింది.
సమాచారం సేకరించిన కమిటీ
తాళ్లముదునూరు పాడులో అగిరి నాగభూషణ రావు పేరుతో జారీ చేసిన బాండ్లపై జిల్లా కమిటీ సమాచారాన్ని సేకరించింది. నాగభూషణరావుతో స్థల యజమానులు అపార్ట్ మెంట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. టీడీఆర్ బాండ్లు జారీ అయితే వాటిని కూడా సదరు అపార్ట్ మెంట్కు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. అయితే మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారిని మున్సిపాలిటీకి రిజిస్ర్టేషన్ చేసే బాధ్యత యజమానులపై ఉంటుంది. మరోవైపు జూన్ 15వ తేదీన రిజిస్ర్టేషన్ చేస్తే అదే నెల 16వ తేదీన బాండ్లు జారీ చేసేశారు. వాస్తవానికి అవి ఎన్ని గజాలు..క్షేత్రస్థాయిలో స్థలం ఉందా...లేదా అనే విషయాన్ని సర్వేయర్ ద్వారా పరిశీ లించాలి. అన్నీ సవ్యంగా ఉంటేనే బాండ్లు జారీ చేయాలి. ఒక్కరోజు వ్యవధిలోనే బాండ్లు జారీచేయడంపై కమిటీ దృష్టి పెట్టింది. రహదారి విస్తరణ లేనప్పుడు బాండ్లు ఎందుకు జారీ చేశారన్న విషయంపైనా కమిటీ ఆరా తీసింది. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్లే మార్కెట్ రహదారి పైనే ఇతర చోట్ల టీడీఆర్ బాండ్లు జారీచేశారు. వీటన్నింటిపై ఇప్పుడు కూటమి కూడా ఆరా తీసింది. సీబీసీఐడీ దర్యాప్తునకు పట్టుబడుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మున్సి పాలిటీలో జారీ అయిన బాండ్లన్నింటినీ పరిశీలించేందుకు సీబిసీఐడి ఒక్కటే మార్గమని కూటమి నేతలు భావించి ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
బాండ్ల సొమ్ములు ఎలా మళ్లాయి ?
టీడీఆర్ బాండ్లను విక్రయిస్తే పారదర్శకంగా సొమ్ములు తీసుకోవాలి. కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా అదే పద్ధతిలో జమ చేయాలి. తాళ్లముదునూరుపాడు బాండ్ల విషయంలో స్థల యజమానులకు సొమ్ములు ముట్టలేదు. బిల్డర్ అగిరి నాగభూషణరావు పేరుతో అయినా సొమ్ములు జమచేయాలి లేదంటే వేరెవరి పేరుతో జమ చేశారా అన్న దానిపై కూటమి నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత సొంత వ్యక్తుల ఖాతాల్లో జమ చేశారని అనుమానిస్తున్నారు. బాండ్లు ఎవరి పేరుతో ఉంటే వారిపేరు మీద సొమ్ములు జమ చేయకపోతే కొనుగోలు చేసిన బాండ్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. దాంతో తాడేపల్లిగూడెంలో జారీ అయిన బాండ్ల అమ్మకాల్లో సొమ్ములు పంపిణీ కూడా ఇప్పుడు కీలకమైంది. సీబీసీఐడి దర్యాప్తు చేపడితే అన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Updated Date - Jul 15 , 2024 | 12:15 AM