యూనిఫార ఏది సార్ ?
ABN, Publish Date - Jun 13 , 2024 | 12:25 AM
నేటి నుంచి బడులు తెరేస్తున్నారు. కానీ నేటికీ జిల్లాలో ఏ పాఠశాల విద్యార్థికి యూనిఫారాలు అందలేదు. యూనిఫాం క్లాత్ వచ్చి బయట కుట్టించడానికి కనీసం పక్షం రోజులు పైనే పడు తుంది. స్కూల్ తెరిచే నాటికి కుట్టించిన యూనిఫారాలు అందించాల్సిన అధికారులు కనీసం క్లాత్ కూడా అందించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది
నేటికీ చేరని దుస్తులు..
విద్యార్థుల ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 12 :నేటి నుంచి బడులు తెరేస్తున్నారు. కానీ నేటికీ జిల్లాలో ఏ పాఠశాల విద్యార్థికి యూనిఫారాలు అందలేదు. యూనిఫాం క్లాత్ వచ్చి బయట కుట్టించడానికి కనీసం పక్షం రోజులు పైనే పడు తుంది. స్కూల్ తెరిచే నాటికి కుట్టించిన యూనిఫారాలు అందించాల్సిన అధికారులు కనీసం క్లాత్ కూడా అందించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లాలోని 1 నుంచి పది వరకూ విద్యార్థులకు ఇవ్వాల్సిన టెక్ట్స్ బుక్స్ కూడా సగమే చేరుకున్నాయి. దీంతీ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన విద్యా సామగ్రి కంటే ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు కుట్టించాలి
గతంలో టీడీపీ హయాంలో విద్యార్థుల యూనిఫారాలు ఏజన్సీలకు అప్పగించి క్లాసుల వారీగా సైజులను బట్టి కుట్టించి స్కూల్ తెరిచేనాటికి టెక్ట్స్ బుక్స్తో పాటు అందించేవారు. తరువాత ఆ ఏజన్సీల నిర్వహణలో క్లాత్ క్వాలిటీ ఉండటం లేదని కుట్టు సరిగా ఉండటం లేదని విమర్శలు రావడంతో స్కూల్స్ ఖాతాలకు సొమ్ములు వేసి హెచ్ఎంలే బాధ్యతగా తమ పాఠశాలల విద్యార్థులకు క్లాత్ కొని కుట్టించే బాధ్యత అప్పగించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వమే క్లాత్ కొనుగోలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాత్ అందిస్తూ వస్తున్నది . కుట్టించుకునేందుకు సొమ్ము తల్లిదండ్రుల ఖాతాలకు వేసే వారు. కానీ నేటికీ ఆ క్లాత్ విద్యార్థుల తల్లిదండ్రులకు చేరలేదు. నేటి నుంచి పాఠశాలలు తెరుచుకుం టుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
టెక్స్ట్ బుక్స్ పరిస్థితి అంతే..
జిల్లాలో 1 నుంచి 7వ తరగతి వరకూ విద్యార్థులకు 12 లక్షల 2192 పుస్తకాలు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకూ 7 లక్షల 39వేల పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు చేరుకున్నాయి. అంటే ఇంకా 4 లక్షల 62 వేల పుస్తకాలు రావాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో ఇంకా మూడో వంతు పుస్తకాలు బుక్ డిపోకు చేరాల్సి ఉంది.ఆ పుస్తకాలు ఏప్పుడు వస్తాయో ఎప్పుడు పాఠశాలలకు పంపిస్తారో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది.
కొత్త సిలబస్ ముద్రణే పూర్తికాలేదు..
ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ అందించే యోచనలో ఉంది. దీనికోసం ఉత్తరప్రదేశ్లోని పుస్తకాల ముద్రణ కేంద్రానికి కాంట్రాక్టు ఇచ్చారు. అయితే ఆ పుస్తకాల ముద్రనే ఇంకా పూర్తికాలేదనే విమర్శలు విని పిస్తున్నాయి. పాఠశాలల పునర్ ప్రారంభం అవుతున్న సందర్భంలో ఎప్పుడు ఈ పుస్తకాలు వచ్చి చేరతాయి ? ఎప్పుడు విద్యార్థులకు సిలబస్ ప్రారంభిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది
కిట్లలోనూ నాణ్యతా లోపం..
జగనన్న కిట్ల పేరిట ప్రతీ ఏటా అందించే స్కూల్ బ్యాగ్స్, బెల్టు, షూ, నోట్బుక్స్, నాణ్యత లేని విమర్శలు వినిపించాయి. బ్యాగ్లైతే మరీ పిల్లలకు ఇచ్చిన వారం రోజుల్లోనే చిరిగిపోయేవి. వాటిని తిరిగి కుట్టించుకునేందుకే రూ.500 ఖర్చుచేయాల్సి వచ్చేది. మిగిలినవి నాణ్యత లేక పోవడంతో ప్రభుత్వ సొమ్ములు దుర్వినియోగమయ్యేవి.
Updated Date - Jun 13 , 2024 | 12:25 AM