ఫ్లెక్సీ కలకలం
ABN, Publish Date - Jul 09 , 2024 | 12:38 AM
కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అక్రమాలు, అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే దూలం అక్రమాలంటూ జనసేన నాయకుడు ఫ్లెక్సీ
ఇంకా ఎవరైనా బాధితులుంటే తెలపాలని సూచన
కైకలూరు, జూలై 8: కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అక్రమాలు, అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంచలనం సృష్టిస్తున్నాయి. కైకలూరు పట్టణ ప్రధాన కూడళ్లలో నాలుగు చోట్ల 27 అంశాలతో భారీ ఫ్లెక్సీలు జనసేన పార్టీ నేత కొల్లి వరప్రసాద్ (బాబి) ఏర్పాటు చేశారు. నెల్లాళ్ల క్రితం వరకు వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులు, ఇతర పార్టీల నేతలు వైసీపీ అరాచకాలపై మాట్లాడితేనే కేసులు, భయబ్రాంతులకు గురి చేయడం వంటివి కొల్లలుగా జరిగాయి. వారు చేసిన అరాచకాలు అన్నింటిని ఫ్లెక్సీలో జనసేన నాయకుడు ఏర్పాటు చేయడంతో కూడలిలో పెద్ద ఎత్తున ప్రజలు వాటిని తిలకిస్తున్నారు. ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. సోమవారం వైఎస్ జయంతిని పురస్కరించుకుని కైకలూరు నీలం సంజీవరెడ్డి మార్కెట్లోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు, వైసీపీ నాయకులు తరలివచ్చారు. సరిగ్గా విగ్రహం సమీపంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో వైసీపీ శ్రేణులు సైతం ఈ ఫ్లెక్సీని ఆసక్తితో తిలకించారు. కైకలూరు నగర పంచాయతీ కాకుండా అడ్డుకోవడం, జగనన్న కాలనీలో అవినీతి, అమాయకులపై అక్రమ కేసులు, ప్రభుత్వ భవనాల కూల్చివేత వంటి 27 అంశాలకు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కారణం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన అవినీతి, అక్రమాలపై ప్రస్తుతం ప్రజలకు తెలియ జేస్తోంది మచ్చుకే అని, ఇంకా వారు చేసిన దౌర్జన్యాలు ప్రజల ముందుకు తీసుకువస్తానని కొల్లి వరప్రసాద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దూలం నాగేశ్వరరావు బాధితుల సంఘానికి తానే అధ్యక్షుడిని అని, ఇంకా బాధితులుంటే తనను కలవవచ్చని, వారి అరాచకాలను ఫ్లెక్సీల రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తానంటూ బాబి వెల్లడించారు.
Updated Date - Jul 09 , 2024 | 12:38 AM