కుమార్తె మృతిపై అనుమానాలు
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:09 AM
ఏలూరు జిల్లా చనుబండలో 5 నెలల క్రితం కందుల జయలక్ష్మి (23) మృతి చెందగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తహసీల్దార్ ప్రశాంతి, ఎస్సై కేసీహెచ్ స్వామి విచారణ జరిపారు.
హోం మంత్రి, ఎస్పీకి తండ్రి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
చాట్రాయి, ఆగస్టు 20: ఏలూరు జిల్లా చనుబండలో 5 నెలల క్రితం కందుల జయలక్ష్మి (23) మృతి చెందగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తహసీల్దార్ ప్రశాంతి, ఎస్సై కేసీహెచ్ స్వామి విచారణ జరిపారు. చాట్రాయి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు కందుల కృష్ణ కుమార్తె జయలక్ష్మి అనే వివాహిత భర్త నుంచి విడిపోయి తండ్రి వద్దే ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందగా ఆమె మృతికి కారణాలు తెలుసుకోకుండా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. తరువాత మృతురాలి సెల్ఫోన్ చెక్ చేయటంతో ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించారని, ఏప్రిల్ 11న మృతురాలి తండ్రి కందుల కృష్ణ చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవటంతో దర్యాప్తు ముందుకు వెళ్ళలేదు. మృతురాలి తండ్రి కందుల కృష్ణ హోం మంత్రికి, జిల్లా ఎస్పీకి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కు ఫిర్యాదు చేయటంతో అధికారులు విచారణ చేపట్టారు. నూజివీడు ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణులు మృతురాలికి దహనం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. వీఆర్వోలు శ్యాం మురుగన్, శోభనబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 01:09 AM