పాలకొండ పీఠం ఎవరిదో?
ABN, Publish Date - May 28 , 2024 | 12:05 AM
కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ టెన్షన్ పెరుగుతోంది. ప్రధానంగా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. కాగా జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇక్కడ జనసేన, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏ పార్టీకైనా 1500 నుంచి 2 వేల ఓట్ల మెజార్జీ మించదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇద్దరు అభ్యర్థుల్లోనూ ధీమా
గెలుపోటములపై సర్వత్రా చర్చలు
నేతలు, కార్యకర్తల్లో ఎన్నడూ లేని ఉత్కంఠ
ఓట్లపై లెక్కలేసుకుంటున్న శ్రేణులు
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ టెన్షన్ పెరుగుతోంది. ప్రధానంగా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. కాగా జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇక్కడ జనసేన, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏ పార్టీకైనా 1500 నుంచి 2 వేల ఓట్ల మెజార్జీ మించదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గెలుపుపై ఇరు పార్టీల అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. కాగా పాలకొండ పీఠం ఎవరికి దక్కుతుంది.. ఎవరు విజేత అవుతారనే దానిపై నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఎన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. కొన్ని మండలాల్లో వైసీపీ, కొన్ని మండలాల్లో జనసేన ఆధిక్యంలో ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పార్టీల నాయకులు, అభిమానుల మాటలు పక్కన పెడితే తటస్థులు కూడా గెలుపోటములపై ఆసక్తి కనబరుస్తున్నారు.
పాలకొండ జనసేన కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నిమ్మక జయకృష్ణకు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014, 2019లో కళావతికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె తన పదేళ్ల పదవీకాలంలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదనే వ్యాఖ్యలు లేకపోలేదు. సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కళావతికి నిలదీతలు తప్పలేదు. ఇంకొన్ని చోట్ల ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. మొత్తంగా కళావతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ.. జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతు తెలిపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా రెండు శిబిరాల్లో ఇప్పటికే పలుమార్లు గెలుపోటములపై దీర్ఘంగా చర్చలు సాగాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ మళ్లీ అంచనాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని పాలకొండ టౌన్తో పాటు పాలకొండ, భామిని, వీరఘట్టం, సీతంపేట మండలాల పరిధిలో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లపై చర్చిస్తున్నారు. గ్రామాల వారీగా విశ్లేషిస్తూ ఏగ్రామం మనకు అనుకూలం, ఏ గ్రామంలో ప్రత్యర్థి ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయో అని సరిచూసుకుంటున్నారు.
టీడీపీ, జనసేన శ్రేణులు ఐక్యంగా..
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణకే ఎన్నికల ముందు అనూహ్యంగా జనసేన టిక్కెట్ దక్కడంతో ఎప్పటిలానే ఉన్న టీడీపీ కేడర్తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన కోసం శ్రమించారు. దీంతో ఈ నియోజకవర్గ పరిధిలో ఏ మండలంలో చూసినా జనసేనకు అత్యధిక ఓట్లు పడ్డాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాలకొండ టౌన్, పాలకొండ మండలం, భామినిలో జనసేనకు అత్యధికంగా ఓట్లు పడినట్లు సమాచారం. వీరఘట్టంలో జనసేన, వైసీపీకి సమానంగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. సీతంపేట విషయానికొస్తే గతం కంటే వైసీపీకి గణనీయంగా మెజార్జీ తగ్గే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో..
2019 ఎన్నికల్లో విశ్వాసరాయి కళావతి వైసీపీ నుంచి పోటీ చేయగా.. ఆమెకు 72,054 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు 54,074 ఓట్లు పడ్డాయి. నోటాకు 3,548, సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన డీవీజీ శంకరరావుకు 3,343, బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాడంగి సునీతకు 1,169 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్.ప్రసాదరావుకు 1001 ఓట్లు పడ్డాయి. అయితే తాజా ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో 1,46,781 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 74,990 మంది, పురుషులు 71,777 మంది, ఇతరులు 14 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated Date - May 28 , 2024 | 12:05 AM