భూముల రికార్డుల భద్రతకు చర్యలు
ABN, Publish Date - Aug 17 , 2024 | 12:39 AM
భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
కలెక్టరేట్: భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భోగాపురం మండలం పోలిపల్లి, బసవ పాలెం గ్రామాలను సందర్శించామని, ఎఫ్సీవో, పాత అడంగల్, 22ఏ జాబితాలను పరిశీలించామని చెప్పారు. కొన్ని రికార్డుల్లో భూ ముల వర్గీకరణలో గుర్తించిన తేడాలను సరిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని సుమారు 5,700 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారని, దానిలో 191 ఎకరాల వరకూ రిజిస్ర్టేషను పూర్తయ్యాయని తెలిపారు. నిబంధనలు ప్రకారం ఫ్రీహోల్డ్ జరి గిందా? లేదా? రిజిస్ర్టేషన్లు సక్రమంగా జరిగాయా? లేదా అనే విషయాన్ని పరిశీలించామని తెలిపారు.
ఇళ్ల పథకం భూములపై ఆరా..
జిల్లాలోని పేదలందరికీ ఇళ్లు పఽథకంలో కేటాయించిన భూముల వివరాలను నిర్దేశిత నమూనాలో సమర్పించాలని ఆయన చెప్పారు. ఈ పథకం కింద ఎంత భూమి కేటాయించారు? అందులో ప్రభుత్వ భూమి ఎంత? డి.పట్టా భూమి ఎంత? ఎంత కొనుగోలు చేశారు? పరిహారం ఎంత చెల్లించారు? ఇళ్ల కోసం కేటాయించగా... ఇంకా ఎంత మిగిలింది? లబ్ధిదారుల అర్హత వివరాలతో రెవెన్యూ సదస్సుల్లో సమర్పించాలని సూచించారు. గత ఐదేళ్లలో 22ఏ కింద నోటిఫై చేసిన భూముల వివరాలను, మ్యుటేషన్ సేవలను మండలాల వారీగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం వరకూ ప్రీ హోల్డ్లో ఉన్న భూములను వెరిఫికేషన్ చేయవలసి ఉందన్నారు. సబ్ రిజిస్ర్టార్ రికార్డులు, తహసీల్దార్ రికార్డులలో ఉన్న వివరాలు ఒకేలా ఉండాలని చెప్పారు.
భద్రతపై దృష్టి
జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూ రికార్డులకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. కార్యాలయాలకు అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయంలో వాచ్మెన్ను నియమించాలని చెప్పారు. కలెక్టర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలపై చర్యలు తీసుకోండి..
కలెక్టరేట్: ‘క్షేత్ర స్దాయిలో కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గుర య్యాయి. గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీ సర్వే వల్ల కొత్త సమస్యలు వచ్చాయి త ప్ప పరిష్కారం కాలేదు. రెవెన్యూ రికార్డుల్లో అనేక చోట్ల పేర్లు మారిపోయాయి. దీని వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఈ అక్రమాలపై చర్యలు తీసుకుని లోపాలను సరిదిద్దాల’ంటూ వివిధ గ్రామాల రైతులు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు మొర పెట్టు కున్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో భూ సమస్యలపై రైతులు వినతులు సమ ర్పించారు. వివిధ సమస్యలపై 80 వినతులు వచ్చాయి. నేరుగా వినతులు స్వీకరించిన ప్రత్యేక కార్యదర్శి సిసోడియా పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అందించారు.
చెరువు గర్భం రిజిస్ట్రేషన్..
‘డెంకాడ మండలం గుణుపూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 60-3లో ఆనందరాజు చెరువు 22.24 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు కింద 30 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు గర్భాన్ని ఈ ఏడాది మే 24, 25 తేదీల్లో కొందరు వ్యక్తులు బినామీ పేర్లతో సుమారు 15 ఎకరాల మేరకు భోగాపురం సబ్రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. రైతుల ఆందోళనతో రిజిస్ర్టేషన్లు రద్దు చేసినట్లు సబ్ రిజిస్ర్టార్ ప్రకటించారు. అయినా బినామీ పేర్లతో ఇంకా 1 బిలు ఆన్లైన్లో కనిపిస్తున్నా యి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య లు తీసుకోలేదు. మరోవైపు అనందరాజు చెరువు కింద సాగు చేస్తున్న అర్హులైన రైతులకు 1బిలు ఉన్నాయి. కానీ అర్హుల పేర్లు తొలగించి.. అనధికారికంగా రిజిస్ర్టేషన్ చేసుకున్న రైతుల పేర్లు నమోదు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని నిజమైన రైతులకు న్యాయం చేయాల’ని దామోధరరావు, కామేష్రావు, ఈశ్వరరావు సిసోడియాను కోరారు.
ఆ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
‘జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి వీఆర్వో, సర్వేయర్ ఆదే గ్రామంలో ఉండేలా చూడాలి. తహశీల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ కోసం వెళ్తున్న చిన్న, సన్న కార రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడంతో మ్యుటేషన్ దరఖాస్తులను తిరస్కరణకు గురవుతున్నాయి. వీటిని సరి చేసి రైతులకు న్యాయం చేయాల’ని ఏపీ రైతు సంఘ నాయకులు రాంబాబు, ఆదినారాయణలు రెవెన్యూ కార్యదర్శికి విన్నవించారు.
లేఅవుట్ ప్లాట్లకు 1బీ ఇచ్చారు..
‘విజయనగరం పట్టణంలోని ధర్మపురి రెవెన్యూ పరిధిలో 1982లో రైల్వే కోఆపరేటివ్ సొసైటీ పేరిట 4 ఎకరాల విస్తీర్ణంలో లేఆవుట్ వేశారు. అందులో వేసిన ప్లాట్లను అప్పట్లో చాలా మంది ఉద్యోగులు కొనుగోలు చేసుకున్నారు. 2022లో ఓ ప్రజా ప్రతినిధి పేరున అప్పటి రెవెన్యూ అధికారులు 1బి ఇచ్చారు. పురపాలక శాఖకు పన్ను చెల్లిస్తుండగా 1బి ఎలా మంజూరు చేశారో తెలియడం లేదు. కోర్డులో కేసు ఉంటుండగా 1 బి మంజూరు చేయడం సరికాదు. దీనిపై విచారణ చేపట్టి... న్యాయం చేయాల’ని ప్లాటు కొనుగోలుదారుడు మోహనరావు ఫిర్యాదు చేశారు.
Updated Date - Aug 17 , 2024 | 12:39 AM