ఉలిక్కిపడ్డ రాజాం
ABN, Publish Date - Aug 23 , 2024 | 12:39 AM
గరివిడి మండలం అప్పన్నవలస వద్ద జరిగిన సంఘటనతో రాజాం ప్రాంతం ఉలికిపడింది. వ్యాపార లావాదేవీల కోసం నిత్యం రాజాం నుంచి విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాలకు ఆ గ్రామం మీదుగానే రాకపోకలు సాగించే వ్యాపారులు, బంగారు వర్తకులు ఆందోళన చెందుతున్నారు.
ఉలిక్కిపడ్డ రాజాం
గన్ సంస్కృతిపై వ్యాపారులు, బంగారు వర్తకుల్లో భయాందోళన
రాజాం రూరల్/ గరివిడి, ఆగస్టు 22: గరివిడి మండలం అప్పన్నవలస వద్ద జరిగిన సంఘటనతో రాజాం ప్రాంతం ఉలికిపడింది. వ్యాపార లావాదేవీల కోసం నిత్యం రాజాం నుంచి విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాలకు ఆ గ్రామం మీదుగానే రాకపోకలు సాగించే వ్యాపారులు, బంగారు వర్తకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్తో గురిపెట్టి బెదిరించి కాల్పులు జరపడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజాం ప్రాంతంలో వెస్ట్బెంగాల్ ప్రాంతానికి చెందిన సుమారు 30 మంది బంగారం నిపుణులు రెండు దశాబ్దాలకు పైగా స్థిరపడ్డారు. వీరంతా బంగారం షాపుల యజమానులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ఆభరణాల తయారీ కోసం లక్షలాది రూపాయల విలువచేసే బంగారంతో పలుమార్లు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం వెళ్లి వస్తుంటారు. తాజాగా జరిగిన కాల్పుల సంఘటనతో భయాందోళన చెందుతున్నారు.
ఘటన జరిగిందిలా..
రాజాం పట్టణానికి చెందిన బంగారం వ్యాపారులు కిల్వర్ హుస్సేన్మాలిక్, షేక్ నజీమ్లు సుమారు 50 గ్రాముల బంగారాన్ని విజయనగరం తీసుకువెళ్లి అక్కడి మార్కెట్లో మెరుగులు దిద్దించి తిరిగి బైక్పై బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రాజాం బయలుదేరారు. చీపురుపల్లి దాటి అప్పన్నవలస సెంటర్కు వచ్చేసరికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వీరి బైక్ను అడ్డుకున్నారు. వారి దౌర్జన్యాన్ని గమనించిన ఆ వ్యాపారులు రహదారి పక్కన ఉన్న సమీప పొదల్లోకి బంగారు ఆభరణాల్ని విసిరేశారు. దీనిని గమనించని దొంగలు విలువైన వస్తువులు, డబ్బులు, సెల్ఫోన్ ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు. వినకపోవడంతో ఇద్దరిపైనా నాటు తుపాకీ గురిపెట్టి కాల్పులకు దిగారు. అంతేకాకుండా తమతో తెచ్చిన కారాన్ని ఇద్దరి క ళ్లల్లో జల్లి ఇనుపరాడ్డులతో దాడి చేశారు. గాయపడిన వ్యాపారులు పూర్తిగా తేరుకోకమునుపే వారి దగ్గరున్న కొంత నగదు, సెల్ఫోన్లను తీసుకుని దుండగులు బైక్పై పరారయ్యారు. గాయాలపాలైన ఇద్దరు రాజాం ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గరివిడి ఎస్ఐ ఎల్.దామోదరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం ఉదయం రాజాంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో హుస్సేన్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. చేతి భాగంలో దూసుకుపోయిన బుల్లెట్ను వైద్యులు తొలగించారు. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్పల్ప గాయాలకు గురైన నజీమ్ ఆరోగ్య పరిస్థితి సైతం అదుపులో ఉంది.
Updated Date - Aug 23 , 2024 | 12:39 AM