అడ్డగోలుగా తవ్వకాలా?
ABN, Publish Date - May 17 , 2024 | 04:08 AM
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకాడొద్దని ప్రభుత్వానికి
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పాటు
4 రోజుల్లో మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలి
ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వండి
అక్రమాలపై చర్యలకు వెనుకాడొద్దు
ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్
ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలనూ పాటించాలి
ఇసుక మైనింగ్పై ధర్మాసనం మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకాడొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి అవకతవకలపై క్రిమినల్ చర్యలు తీసుకొని నాలుగు రోజుల్లోగానివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్పై గురువారం సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కమిటీలోని అధికారులను తామే నియమించినట్లుగా భావించి విధులు నిర్వర్తించాలని, ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మధ్యంతర నివేదికను సమర్పించింది. రూ.10వేల కోట్ల మేర అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరఫు న్యాయవాది సిద్థార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ... ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, దీనిపై రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలనూ పాటించాలని నిర్దేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఫిర్యాదుల కోసం ఈ-మెయిల్, టోల్ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలని, దీనిపై భారీగా ప్రచారం కల్పించాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలకు భారీయంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణ శాఖ కోర్టు దృష్టికి తేగా.. ఆ ప్రదేశాలను అధికారులు గుర్తించి, వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొంది. ఆదేశాల అమలుపై జూలై 9లోపు అపిఢవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.
Updated Date - May 17 , 2024 | 04:08 AM