ఘనవిజయం మీదే!
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:35 AM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
బాబుకు గోయల్ ముందస్తు శుభాకాంక్షలు
అమరావ తి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ఘన విజయం సాధించబోతున్నారు. అన్ని సర్వేల్లో అదే వస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే తిరుగులేని విజయం పొందబోతోంది. మీకు ముందస్తు శుభాకాంక్షలు’ అని చంద్రబాబుతో ఆయన అన్నట్లు సమాచారం. ఆయనకు మాజీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం ఉదయం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ సహాయ కార్యదర్శి శివప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్తో కలిసి గోయల్ ఇక్కడి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. సుమారు 2 గంటలు వివిధ అంశాలపై చర్చించారు. ఇరవై నిమిషాలపాటు వారిద్దరూ విడిగా మాట్లాడుకున్నారు. ఉమ్మడి ప్రచార వ్యూహం, ఇరు పార్టీల మధ్య సమన్వయం, కేంద్ర నేతల పర్యటనలు తదితర అంశాలపై చర్చ జరిగింది. బీజేపీ పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం ఉందని.. అందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని పీయూష్ నొక్కిచెప్పారు.
Updated Date - Apr 26 , 2024 | 05:37 AM