వారానికోసారి ప్రత్యేకాధికారులు మండలాలకు వెళ్లాలి
ABN, Publish Date - Aug 20 , 2024 | 11:06 PM
వారానికోసారి ప్రత్యేక అదికారులు మండలాలకు వెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కలెక్టరేట్: వారానికోసారి ప్రత్యేక అదికారులు మండలాలకు వెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఈఆర్వోలంతా ఎలక్టోరల్స్కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉంచరాదన్నారు. బుధవారం నుంచి ఇంటింటి సర్వే చేయాలన్నారు. దీనిపై మండలాల వారీగా సమీక్షిస్తూ పెండింగులో ఉన్న దరఖాస్తులపై అలసత్వం పనికిరాదని స్పష్టం చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం మండల అధికారుల ద్వారా నేరుగా వెళ్లాలని ఆదేశించారు. కోర్టు కేసులుపై తక్షణమే స్పందించాలని, గృహ నిర్మాణాలపై మాట్లాడుతూ 100 రోజుల్లో లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. లేఅవుట్లులో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, లబ్దిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధిహామీ పథకంపై ఈ నెల 23న జరిగే గ్రామసభకు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకానికి సంబంధించిన టీకాల కార్యక్రమంపై గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో అప్పారావు, ఆర్డీవోలు సీహెచ్ రంగయ్య, జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, రిజిష్ట్రార్ మన్మథరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, కోపరేటివ్ రిజిస్ట్రార్ సుబ్బారావు, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్, డీఎంహెచ్వో మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, భూగర్భ గనులశాఖ డీడీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Aug 20 , 2024 | 11:06 PM