స్టీల్ప్లాంట్ను పరిరక్షించాలి
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:50 PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
- అఖిలపక్ష నేతల డిమాండ్
అరసవల్లి, సెప్టెంబరు 10: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక ఏడురోడ్ల జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘ప్లాంట్కు సంబంధించిన 3 బ్లాస్ట్ ఫర్నేస్ల్లో గతంలో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడింది. ఇప్పుడు మరో బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా మూసేశారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం 73 లక్షల టన్నులు ఉండగా.. గతేడాది 45లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది ఇంకా తగ్గిపోతుంది. దీంతో రోజుకు రూ.15కోట్లు నష్టం వస్తోంది. విశాఖ స్టీల్ను మరింత నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్కు అప్పగించాలని కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోంద’ని వారు విమర్శించారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మలు స్టీల్ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహనరావు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, కౌలురైతు సంఘం కార్యదర్శి వెలమల రమణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, వివిధ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:50 PM