పలాసలోనా.. వద్దేవద్దు
ABN, Publish Date - Aug 25 , 2024 | 11:35 PM
పలాస-కాశీబుగ్గలో ఏడాదిన్నర కిందట కేటీ రోడ్డు నిర్మించారు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న 150 భారీ విద్యుత్ స్తంభాలు ఉండేవి. వీటిని మార్చడం, కొత్త స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్కు రూ.1.20కోట్లకు ఒప్పందంతో అధికారులు పనులు అప్పగించారు. ఆయన ఆఘమేగాలపై పనులు పూర్తిచేశారు. కానీ ఇప్పటివరకూ కాంట్రాక్టర్కు రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు.
- పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ
- రూ.10కోట్ల మేర బిల్లుల బకాయిలు
- ఏడాదిన్నరగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
- పట్టించుకోని ఇంజనీరింగ్ అధికారులు
- సమన్వయలోపంతో కుంటుపడిన అభివృద్ధి
(పలాస)
పలాస-కాశీబుగ్గలో ఏడాదిన్నర కిందట కేటీ రోడ్డు నిర్మించారు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న 150 భారీ విద్యుత్ స్తంభాలు ఉండేవి. వీటిని మార్చడం, కొత్త స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్కు రూ.1.20కోట్లకు ఒప్పందంతో అధికారులు పనులు అప్పగించారు. ఆయన ఆఘమేగాలపై పనులు పూర్తిచేశారు. కానీ ఇప్పటివరకూ కాంట్రాక్టర్కు రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. ఏడాదిన్నరగా ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కమిషనర్, పాలకవర్గం చుట్టు తిరుగుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రశ్నిస్తే 14వ ఆర్ధిక సంఘం నిధుల్లో పెట్టామని, కాదుకాదు.. 15వ ఆర్ధిక సంఘ నిధులని, చివరకూ జనరల్ ఫండ్ నుంచి చెల్లిస్తామని చెబుతున్నారు. చివరకు ఆ ఫైల్ ఇంతవరకూ కదలలేదని తెలియడంతో ఆ కాంట్రాక్టర్.. మునిసిపల్ పనులు ఎందుకు చేశానా? అని ఆవేదన చెందుతున్నారు.
..ఇది పలాస-కాశీబుగ్గ మునిసిపాటిలో ఒక్క విద్యుత్ పనులు చేసిన కాంట్రాక్టర్ పరిస్థితే కాదు. అందరి కాంట్రాక్టర్లదీ ఇదే దుస్థితి. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం కాంట్రాక్టర్లకు రూ.10కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో పనులంటేనే కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు, కార్యాలయం అధికారులు, పాలకవర్గం మధ్య సమన్వయలోపంతో మొత్తం అభివృద్ధి పనులన్నీ పడకేశాయి. ఒక ఇంజనీరింగ్ అధికారి.. ఇక్కడ చక్కబె ట్టాల్సిన ఫైల్స్ అన్నీ తీసుకెళ్లి ఇంట్లో దాచుకున్నారు. ప్రశ్నిస్తే ఒక్కో ఫైల్ను తీసుకువచ్చి క్లియర్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఆ అధికారి ఇక్కడున్నది కేవలం వారికి ఒక రోజు కావడంతో.. పనులన్నీ కిందిస్థాయి సిబ్బందితో చేస్తు చివరకు అతని సంతకాల కోసం శ్రీకాకుళం తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
- అధికారుల తీరుపై విమర్శలు
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే వారికి బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది పనులు పూర్తిచేసినా బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న అంతరకుడ్డ రహదారి పనులు వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా చేశారు. దీంతో వాటి బిల్లులు ఇవ్వొద్దని చైర్మన్ చెప్పినా.. పనులు పూర్తిచేయకుండానే ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్కు రూ.45లక్షలు చెల్లించారు. ఆ కాంట్రాక్టర్ పనులు మధ్యలో విడిచిపెట్టి పరారీ అయ్యాడు. అదనంగా జనరల్ ఫండ్ రూ.15లక్షలతో అధికారులు ఎలాగోలా పనులు పూర్తిచేయించారు. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం చూపించిన ఇంజనీర్లు.. మిగిలిన పనులపై ఎందుకు తాత్సారం చేస్తున్నారో వారే సమాధానం చెప్సాల్సి ఉంది.
- పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల మధ్య ముత్యాలమ్మకోనేరు- నెహ్రూపార్కు ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉండేది. బాగున్న ఈ పార్కును ఆధునికీకరణ పేరిట అధికారులు రూ.28లక్షలు వెచ్చించి నాశనం చేసేశారు. కొత్త పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. కాంట్రాక్టర్కు నిధులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ పార్కుకు రూ.కోటి నిధులు వెచ్చించినా పూర్తయ్యే పరిస్థితి లేదు.
- పలాస-కాశీబుగ్గ కేటీ రోడ్డు పనులు రెండు విభాగాలుగా చేసి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.3కోట్ల విలువైన ఈ పనులకు ఏ నిధులు కేటాయిస్తారో స్పష్టత లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఆదరాబాదరాగా పనులు చేసి మధ్యలో విడిచిపెట్టారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే పనులు ఆగిపోయాయి. దీనిపై కొంతమంది విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో ఆ సాకు చూపిస్తూ ఇంజనీరింగ్ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- కాశీబుగ్గ గాంధీనగర్లో 45 అడుగుల రోడ్డు వ్యవహారానికి సంబంధించి ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన అక్కడున్న ఆక్రమణలు తొలగించారు. అయితే అదేరీతిలో ఇంజనీరింగ్ అధికారులు రహదారిని నిర్మించాల్సి ఉంది. దీనికి అనేక సాకులు చెబుతు పనులు చేయకుండా కాలయాపన చేశారు. దీంతో పాలకవర్గం స్పందించి లేఖలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఇంకా అదేబాటలో..
వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ఆ పార్టీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇంజనీర్లను ఒకరు, కార్యాలయం సిబ్బందిని మరొకరు.. ఒప్పంద కార్మికులును ఇంకొకరు.. ఇలా మొత్తం పంచేసుకుని పాలన సాగించారు. పాలకవర్గం ఉన్నా, సభ్యులకు తెలియకుండానే పనులు సాగిపోతుండడంతో వారు సైతం మౌనం దాల్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు పక్కకు తప్పుకున్నారు. అయితే మునిసిపల్ అధికారులు మాత్రం అదే నిషాలో ఉంటూ పాలకవర్గం మాటలను పెడచెవిన పెడుతున్నారనే ప్రచారం ఉంది. అధికారుల సహకారం లేక పాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. కమిషనర్ మాట ఇంజనీరింగ్ అధికారులు వినకపోవడం.., ఇంజనీరింగ్ అధికారుల మాట కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం జరుగుతోంది. వారు సైతం నిత్యం సెలవులు, వివిధ సాకులతో గైర్హాజరు కావడంతో పాలన పూర్తిగా కుంటుపడింది. ప్రస్తుతం ఈ అధికారులు మాకు వద్దు మొర్రో అన్నదాకా వ్యవహారం వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి.. మునిసిపల్ పాలన గాడిలో పెట్టాల్సి ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పాలకులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Aug 25 , 2024 | 11:35 PM