రోగులపై ఆర్థిక భారం వద్దు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:57 PM
ఎన్టీఆర్ వైద్యసేవల కింద రోగులపై ఆర్థిక భారం వేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
- మెరుగైన వైద్యసేవలందించాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కలెక్టరేట్, ఆగస్టు 24: ఎన్టీఆర్ వైద్యసేవల కింద రోగులపై ఆర్థిక భారం వేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘రోగులపై ఆర్థికభారం వేయకుండా మెరుగైన వైద్యం అందించాలి. ఆరోగ్యమిత్రలు బాధ్యత వహించాలి. రోగులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. సమావేశం రోజున వారిని పిలవాలి. ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందించాలి’ అని సూచించారు. ఎన్టీఆర్ వైద్యసేవల కోఆర్డినేటర్ ప్రకాశరావు మాట్లాడుతూ ‘ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన ధరలను బోర్డుపై ప్రదర్శించాలి. రోగుల నుంచి ఎటువంటి నగదు వసూళ్లు చేయరాదు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు అక్కడ ఆ సేవలు అందుబాటులో లేకపోతే.. ఎక్కడ లభిస్తాయో వివరించాలి. మెనూలో భోజనంతోపాటు పాలు, పండ్లు ఉండేలా చూడాలి. 108 అంబులెన్స్ సేవలను పక్కాగా వినియోగించాలి’ అని తెలిపారు. వివిధ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులను ఆయన కలెక్టర్కు వివరించారు. సమావేశంలో డీసీహెచ్వో రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీకాంత్, కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులు ప్రవీణ్కుమార్(జెమ్స్), సోమేశ్వరరావు(కిమ్స్), శివకుమార్(మెడీకవర్), తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో భద్రత తప్పనిసరి
జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలి. కార్మికులు, సిబ్బంది సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని భారీ, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పరిశ్రమల్లో కార్మికులు పాటించాల్సిన భద్రత నియమాలపై రానున్న రెండు వారాలు సంపూర్ణ శిక్షణ ఇవ్వాలి. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. అమ్మోనియా, క్లోరిన్, ఎల్సీజీ, బ్యుటెన్ వంటి మండే స్వభావం గల వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం కారణంగా ఇటీవల పలు పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు జరిగాయి. అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను సమర్థంగా నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి’ అని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పరిశ్రమల మేనేజర్ ఉమామహేశ్వరరావు, ఏడీ రమణారావు, అగ్నిమాపక అధికారి మోహనరావు, పర్యావరణశాఖ ఇంజనీర్ రామారావునాయుడు, రెడ్డీస్ ల్యాబ్రేటరీస్, యునైటెడ్ బ్రెవరీస్, నాగార్జున అగ్రికెమ్, అరబిందో ఫార్మా, ఆంధ్రా ఆర్గానిక్స్, స్మార్ట్కెమ్ టెక్నాలజీ, విశాఖ డెయిరీ, సరాఖ లేబ్, తదితర పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.
Updated Date - Aug 24 , 2024 | 11:57 PM