జై.. జగన్నాథ
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:58 PM
జిల్లాలో జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం వైభవంగా సాగింది.
వైభవంగా మారు రథయాత్ర
శ్రీకాకుళం కల్చరల్/ఇచ్ఛాపురం, జూలై 15: జిల్లాలో జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం వైభవంగా సాగింది. పూలతో అలంకరించిన రంగుల రథాలపై కొలువుతీరిన సుభద్ర, బలభద్ర జగన్నాథుని రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. జైజగన్నాఽథ అంటూ స్వామిని దర్శించుకున్నారు. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలో జగన్నాథస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంలో వేంచేసి గుడించా మందిరం నుంచి బాలు పాణిగ్రాహీ ఆధ్వర్యంలో ఊరేగించారు. బొందిలీపురంలో ఉన్న స్వామి మందిరానికి మేళతాళాలతో తీసుకెళ్లారు. దారి పొడవునా భక్తులు స్వామిని దర్శించుకుని హారతులు పట్టారు.
ఇచ్ఛాపురంలోనూ జగన్నాథస్వామిని.. ఇంద్రజిమ్నం(గుడించా మందిరం) నుంచి శ్రీవారి సుధామం(ఆలయం) వరకూ ఊరేగించారు. సంప్రదాయ బద్ధమైన శంఖుమేళా, కళాకారులతో పంజాబీడోలా, విచిత్ర వేషాధారణలు, భజగోవింద గోష్టి, మంగళవాయిద్యాల మధ్య రథయాత్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు, టౌన్ ఎస్సై సత్యన్నారాయణ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Jul 15 , 2024 | 11:58 PM