జస్టిస్ రవీంద్రబాబు పదవీ విరమణ
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:39 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మొదటి కోర్టు హాలులో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ రవీంద్రబాబు అందించిన న్యాయసేవలను కొనియాడారు.
ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
న్యాయసేవలను కొనియాడిన సీజే జస్టిస్ ఠాకూర్
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మొదటి కోర్టు హాలులో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ రవీంద్రబాబు అందించిన న్యాయసేవలను కొనియాడారు. న్యాయాధికారిగా, హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో క్లిష్టమైన కేసులు పరిష్కరించారని చెప్పారు. హైకోర్టులోని వివిధ కమిటీల్లో సభ్యుడిగా విశిష్ట సేవలు అందించడంతో పాటు రిజిస్ట్రార్ జనరల్గా పరిపాలనను మెరుగుపర్చారని గుర్తుచేశారు. పదవీ విరమణ తరువాత జస్టిస్ రవీంద్రబాబు శేషజీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. జస్టిస్ రవీంద్రబాబు మాట్లాడుతూ... క్రిమినల్ అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి బార్లోని సీనియర్ న్యాయవాదులు సహరించాలని కోరారు. వృత్తి జీవితంలో తనకు సహాయ సహకారాలు అందించినవారికి కృతజ్ఙతలు తెలిపారు. జస్టిస్ రవీంద్రబాబు అందించిన న్యాయసేవలను అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్.ద్వారకానాథ్రెడ్డి, అడిషనల్ సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ రవీంద్రబాబు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, ఏఏజీ సాంబశివ ప్రతాప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2024 | 03:40 AM