అల్లరిమూకలకు ముకుతాడు
ABN, Publish Date - May 26 , 2024 | 11:18 PM
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు.
కొందరిపై పీడీ చట్టం ప్రయోగం
ఎన్నికల కోడ్ సమయంలో కేసులు నమోదైన వారిపై షీట్లు
బైండోవర్ ఉల్లంఘించిన వారిపైనా కొరడా
కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
ఒంగోలు (క్రైం), మే 26 : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అల్లర్లకు పాల్పడిన వారిపై హిస్టరీ షీట్లు తెరిచే పనిలో పడ్డారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా బైండోవర్ అయి నిబంధనలకు ఉల్లంఘించిన వారిపైనా కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే సబ్ డివిజన్ల వారీగా ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అదేక్రమంలో ఎన్నికల గొడవల్లో ఉద్యోగులు పాల్గొంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం అణచివేతకే ఇలాంటి చర్యలు అని ప్రతిపక్షాలు అంటుండగా, అధికారపార్టీ నాయకులు మాత్రం తాము పోలీసులు పిలిస్తే ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.
భైండోవర్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై దృష్టి
ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే సుమారు 26,000 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. మండల మేజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ వద్ద వారిని హాజరుపరిచి సుమారు రూ.లక్ష పూచీకత్తు, బాండ్పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. వీరిలో సుమారు 50 నుంచి 100 మంది వరకూ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారంతా బైండోవర్ ఉల్లంఘించినట్లు మండల మేజిస్ట్రేట్లకు పోలీసులు నివేదికలు సమర్పించారు. ఈమేరకు బైండోవర్ ఉల్లంఘించిన వారంతా మేజిస్ట్రేట్ ముదు హాజరై వారు ఇచ్చిన వ్వక్తిగత పూచీకత్తు బాండ్ విలువ చెల్లించాల్సి ఉంది. అయితే అందుకు ముఖ్యంగా అధికార పక్షం వారు ససేమిరా అంటున్నారు. ప్రతిపక్షాల వారు సాచివేత ధోరణిని అవలంబిస్తున్నారు. అలాంటి వారికి మూడు సార్లు సమన్లు జారీచేసి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్కు పంపే అవకాశం ఉంది.
ఒంగోలులో నలుగురైదుగురిపై పీడీ యాక్ట్?
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేయాలంటే కలెక్టర్ ఆమోదం తెలపాలి. గతంలో గంజాయి విక్రయదారులు, నాన్ డ్యూటిపెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్) విక్రయించే వారిపై ఈ యాక్ట్ను అమలు చేశారు. ఎక్కువ నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారని భావిస్తే వారు చేసిన నేరాల చిట్టాతోపాటు, వారి చరిత్రను నివేదిక రూపంలో తయారు చేసి కలెక్టర్కు సమర్పించాలి. ఆయన ఆమోదిస్తే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి మూడు నెలలపాటు జైలుకు పంపుతుతారు. అలా ఒంగోలులోనే నలుగురైదుగురిపై ఈ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా మరికొందరిపై కూడా ప్రయోగించే అవకాశం ఉంది.
300 మందిపై హిస్టరీ షీట్లు తెరిచే అవకాశం
ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైన వారిపై హిస్టరీ షీట్లు తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇలా అయితే కొంతమంది ఉపాధ్యాయులు, పోలీసులపై కూడా షీట్లు తెరవాల్సి వస్తుంది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్కు డబ్బులు తీసుకొని ఓటు వేసిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి వారి విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా పోలీసులు ఇప్పటికే న్యాయకోవిదుల సలహాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత రాజకీయపరమైన ఘర్షణలకు పాల్పడిన వారిపై కూడా షీట్లు తెరవనున్నారు. అలాంటి వారు ఒంగోలు నియోజవకవర్గంలోనే సుమారు వందకుపైగా ఉండవచ్చని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో మరో రెండు వందలకుపైగా ఉండవచ్చని సమాచారం. షీట్లు ఉన్న వారిని కౌంటింగ్ సందర్భంగా కనీసం ఒకరోజంతా పోలీసులు తమ అదుపులో ఉంచకునే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ తెలిపారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. కౌంటింగ్కు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ (క్రైం) శ్రీధర్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్బాబు, ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, సింగరాయికొండ సీఐ రంగనాఽథ్ తదితరులు ఉన్నారు.
Updated Date - May 26 , 2024 | 11:18 PM