ముగిసిన నామినేషన్ల పర్వం
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:19 AM
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.
175 అసెంబ్లీ స్థానాలకు 5,751 నామినేషన్లు
25 ఎంపీ స్థానాలకు 1,070 దాఖలు
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ముగిసింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి, వైసీపీ సహా రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు మొత్తం 5,751 నామినేషన్లు, లోక్సభ స్థానాలకు మొత్తం 1,070 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే..వీటిలో కొన్ని మార్పులు,చేర్పులు ఉండే అవకాశముందని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలి రోజు నుంచి అభ్యర్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తొలిరోజు మంచి ముహూర్తం కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. తర్వాత రోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దాఖలు చేయగా.. చివరి రోజైన గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. మరోవైపు,నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ వరకు అవకాశం ఉంది.
Updated Date - Apr 26 , 2024 | 05:19 AM