3న రాష్ట్రానికి మోదీ
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:21 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
వరుసగా రెండు రోజుల పర్యటన
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రానికి రాబోతున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్సభ నియోజకవర్గంలోని పీలేరులో మే 3న మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రధానితోపాటు ప్రచారంలో పాల్గొంటారు. నాలుగో తేదీన పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమహేంద్రవరం సభలో ప్రధాని పాల్గొని ఎన్డీయే అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తారు. అదేరోజు సాయంత్రం అనకాపల్లిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఢిల్లీకి వెళతారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెలాఖరున వరుసగా రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాలకు సమాచారం అందింది. ఆయన తిరుపతి, విశాఖపట్నంలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Apr 26 , 2024 | 07:20 AM