ఉద్యమంగా స్పార్టన్ గ్రీన్ కర్నూలు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:41 PM
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటాలి.. ఆ మొక్క చెట్టుగా ఎదిగేలా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.
పచ్చదనం పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది, డీఐజీ కోయ ప్రవీణ్
కర్నూలు, కర్నూలు(లీగల్) ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటాలి.. ఆ మొక్క చెట్టుగా ఎదిగేలా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. డ్వామా భాగస్వామ్యం, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారంతో కర్నూలుకు చెందిన ‘స్పార్టన్’ యువతరం శనివారం ‘స్పార్టన్ గ్రీన్ కర్నూలు’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వివిధ రకాల వృక్షజాతుల లక్ష విత్తనాలు పంపిణీ చేశారు. జిల్లా కోర్టు, డీఐజీ కార్యాలయం, రాయలసీమ విశ్వవిద్యాలయం, ఉద్యానవనాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాల ఆవరణాల్లో 30 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది మొక్కలు నాటి నీరు పోశారు. డీజీఐ కోయ ప్రవీణ్ తన కార్యాలయం ఆవరణలో, రాయలసీమ విశ్వవిద్యాలయం ఆవరణలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎఫ్సీఐ పార్కు మైదానంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్పార్టన్ యువతతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ‘స్పార్టన్ గ్రీన్ కర్నూలు’ ఉద్యమానికి సై అనడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్పార్టన్ అధ్యక్షుడు సయీమ్, కేఈ మహదేవ్, చరితారెడ్డి, స్వరూప్, సలీమ్ పవన్, వంశీ, సమీర్, బాలాజీ, స్నేహిత్ తదితరులు పాల్గ్గొన్నారు. ఈ ఉద్యమానికి సతారం చిత్రాలు సినిమా నటీనటులు సహకారం అందించారు.
Updated Date - Aug 24 , 2024 | 11:41 PM