పంటలు చేతికొచ్చే వరకు సహకరించాలి: ఆర్డీవో
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:37 AM
ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికొచ్చే దాకా అన్ని గ్రామాల రైతులు సహకరించాలని ఆర్డీవో దాసు రైతులను కోరారు.
మిడుతూరు, ఆగస్టు 20: ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికొచ్చే దాకా అన్ని గ్రామాల రైతులు సహకరించాలని ఆర్డీవో దాసు రైతులను కోరారు. మిడుతూరు తహసీల్దార్ కార్యాలయంలో మద్దిగుండం చెరువు నీటి సమస్యపై జలకనూరు, సుంకేసుల, చింతలపల్లి గ్రామాల రైతులతో ఆర్డీవోతో పాటు విద్యుత్ ఈఈ జయశంకర్, మైనర్ ఇరిగేషన్ డీఈ రఘరామిరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ మద్దిగుడం చెరువు నీటి సమస్యను పరిష్కరించాలని జలకనూరు, సుంకేసుల, చింతలపల్లి గ్రామాల రైతులు కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చారని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మిడుతూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇరు గ్రామాల రైతులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. వారికి ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు చేతికి వచ్చేవరకు ఇరుగ్రామాల రైతులు మద్దిగుడం చెరువు నీటిని వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం చెరువు కింద సాగులో ఉన్న పంటల వరకు నీటిని వాడుకోవడానికి ఇరుగ్రామాల రైతులతో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేయించుకున్నారు. చెరువు తూముల మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరు అయిన వెంటనే చెరువు నీరు వృథా కాకుండా తూములకు మరమ్మతులు చేయిస్తామని ఇరిగేషన్ డీఈ రఘరామిరెడ్డి అన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ చెరువు నీటి కోసం గొడవలు పడకుండా గ్రామాల్లో రైతులు శాంతియుతంగా, సామరస్యంగా మెలగాలని సూచించారు. అనంతరం జలకనూరు మద్దిగుండం చెరువును ఆర్డీవో పాటు అధికారులు సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో విద్యుత్ డీఈ శ్రీనివాసులు, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఏఈ క్రాంతికుమార్, మైనర్ ఇరిగేషన్ ఏఈ రామ్మోహన్ రెడ్డి, ఎస్ఐ ఓబులేసు, ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:40 AM