‘తెలుగు సాహిత్యానికి కాఫ్కా.. కాశీభట్ల వేణుగోపాల్’
ABN, Publish Date - Aug 25 , 2024 | 11:46 PM
తన రచనలతో 20వ శతాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేసిన జర్మన్ రచయిత ‘ప్రాంజ్ కాఫ్కా’లానే తెలుగు సాహిత్యంలో దివంగత కవి, రచయిత కాశీభట్ల వేణుగోపాల్ నిలిచిపోతారని పలువురు వక్తలు కొనియాడారు.
కవులు, రచయితలు, కళాకారుల నివాళి
కర్నూలు(కల్చరల్), ఆగస్టు 25: తన రచనలతో 20వ శతాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేసిన జర్మన్ రచయిత ‘ప్రాంజ్ కాఫ్కా’లానే తెలుగు సాహిత్యంలో దివంగత కవి, రచయిత కాశీభట్ల వేణుగోపాల్ నిలిచిపోతారని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం నగరంలో మద్దూర్నగర్లోని పింగళి సూరన తెలుగుతోట సమావేశ హాలులో, కర్నూలు సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో ఇటీవల మృతిచెందిన కాశీభట్ల వేణుగోపాల్ సంతాప సభ జరిగింది. ఈ సభకు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ ఆహ్వానం పలుకగా, ప్రముఖ కవి జి. వెంకటకృష్ణ సభాధ్యక్షత వహించారు. వక్తగా హాజరైన రచయిత, ప్రముఖ విమర్శకుడు పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కాశీభట్ల వేణుగోపాల్ కుటుంబానికి, మతానికి, రాజ్యానికి ఎప్పుడూ బద్ధుడు కాలేదని, ఆయన సంప్రదాయ భ్రష్ట్టుత్వంలో జీవించిన ఆధునిక కవి అని కొనియాడారు. విలక్షణమైన రచయితగా, సమాజం పట్ల ముభావంగా ఉంటూ రచనలు చేశారని అన్నారు. ఆయన నిరంతరం నేనూ, నాది అనే కోణం నుంచి రచనలు చేశారని అన్నారు. విశ్రాంత ఎస్పీ రామ ఉమామహేశ్వర శర్మ మాట్లాడుతూ కాశీభట్ల సాహిత్య జీవితం, అతని జీవితం వేరు కావని, రెండూ ఒకటిగా సాగిందని అన్నారు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి, విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. సంగీత విద్వాంసుడు ఎం. దయానంద్ మాట్లాడుతూ కాశీభట్ల సంగీత పరిజ్ఞానం ఉన్నవారని, వేణుగోపాల పదాలతో స్వరాన్ని సృష్టించారని అన్నారు. సభలో మధురకవి ఎలమర్తి రమణయ్య, కథా రచయిత్రి డాక్టర్ సుభాషిణి ఆయన సాహిత్య విలక్షణమైన జీవితాన్ని వివరించారు. అంతకు ముందు కాశీభట్ల వేణుగోపాల్ చిత్రపటానికి ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఉమానాథరావు, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభలో ఆద్య మెడికల్స్ అధినేత అవిజ వెంకటేశ్వరరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, విరసం రాష్ట్ర నాయకుడు పాణి, నాగేశ్వరాచారి, మారుతి పౌరోహితం, డాక్టర్ ఎం. హరికిషన్, చౌశా, సయ్యద్ జహీర్ అహ్మద్, డాక్టర్ పేరం ఇందిరాదేవి, లక్ష్మీ కందిమళ్ల, స్వర్ణలత, సీఐ శ్రీనాథ్రెడ్డి, టి. వెంకటేశ్, ఇనాయతుల్లా, ఎస్డీవీ అజీజ్, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 25 , 2024 | 11:46 PM