కర్నూలు ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్
ABN, Publish Date - Jul 14 , 2024 | 12:09 AM
కర్నూలు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరుకు కృష్ణకాంత్ బదిలీ
కర్నూలు, జూలై 13: కర్నూలు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా కర్నూలు ఎస్పీగా ఈయనను నియమించింది. ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా ఉన్న జి.కృష్ణకాంత్ను నెల్లూరు ఎస్పీగా బదిలీ చేసింది. కృష్ణకాంత్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కర్నూలు ఎస్పీగా నియమితులయ్యారు. ఆ తర్వాత అవినాశ్ రెడ్డి అరెస్టులో సీబీఐకి సపోర్టు చేయకుండా కొంత మెతక వైఖరి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయనీ వెనక్కు తగ్గారు. ఆ తర్వాత జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలు అరికట్టడంలో పలు సందర్భాల్లో ఆయన తన మార్క్ను చూపించుకోలేకపోయారు. ఎన్నికల అనంతరం పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన వైసీపీ దాడులను అరికట్టడంలో విఫలమయ్యారు.
కొత్త ఎస్పీ గురించి
కర్నూలు జిల్లా ఎస్పీగా నియమితులైన గరికపాటి బిందుమాధవ్ స్వస్థలం విజయవాడ. 2017బ్యాచ్కు చెందిన వారు. బీటెక్ మద్యలోనే డిస్కంటిన్యూ చేసి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువుల ప్రోత్సాహంతో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఎస్పీగా పని చేశారు. అలాగే గుంటూరు సెబ్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత 2019-20 మద్యలో గ్రేహౌండ్స్ అసాల్డ్ కమాండర్గా, తర్వాత రంపచోడవరం ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ ఎస్పీగా నియమితులయ్యారు. అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించింది. అక్కడ 40 రోజుల పాటు ఎస్పీగా పని చేసిన ఆయన ఆ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది. ప్రస్తుతం ఆయన్ను కర్నూలు ఎస్పీగా నియమించి ఉత్తర్వులు జారీ చేసింది.
నంద్యాల జిల్లా అధిరాజ్సింగ్ రాణా
నంద్యాల క్రైం, జూలై 13: నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్సింగ్ రాణాను నియమిస్తూ డీజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్న అధిరాజ్సింగ్ రాణాను నంద్యాలకు బదిలీ చేశారు. నంద్యాల నూతన జిల్లాగా ఆవిర్భవించినప్పటినుంచి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కె.రఘువీర్రెడ్డిని డీజీపీ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంతవరకు నంద్యాల ఎస్పీగా పనిచేసిన కె.రఘువీర్రెడ్డి మరో నాలుగు నెలల్లో రిటైర్మెంట్ కానున్నారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారిని దాదాపు బదిలీ చేయరు. కానీ ఎస్పీ రఘువీర్రెడ్డి గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబునాయుడును నంద్యాలలో అరెస్ట్ చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే రఘువీర్రెడ్డిపై బదిలీ వేటు పడినట్లు తెలిసింది. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ ఉదంతంలో కీలకంగా వ్యవహరించారని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఘువీర్రెడ్డిపై బదిలీ వేటు పడుతుందని అందరూ భావించారు. రఘువీర్ రెడ్డి రిటైర్మెంట్ వరకూ ఇక్కడే ఉండాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన బదిలీ అనివార్యం కావడం విశేషం.
Updated Date - Jul 14 , 2024 | 12:09 AM